మోడీ ప్లాన్‌ను పసిగట్టడంలో KCR ఫెయిల్.. బెడిసికొట్టిన గులాబీ బాస్ ముందస్తు వ్యూహం..!

by Satheesh |
మోడీ ప్లాన్‌ను పసిగట్టడంలో KCR ఫెయిల్.. బెడిసికొట్టిన గులాబీ బాస్ ముందస్తు వ్యూహం..!
X

జమిలి వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? పార్లమెంట్​ప్రత్యేక సమావేశాల్లో ఏదో ఒకటి తెలకపోతుందా? అప్పటికే అభ్యర్థుల లిస్ట్​ప్రకటించిన బీఆర్ఎస్​నాయకత్వంలో మొదలైన సందేహాలు ఇవి. అందుకు తగినట్టుగానే పార్టీ ప్రచారాలకు పార్లమెంట్​సమావేశాలు పూర్తయ్యేవరకు విరామం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అయితే, జమిలి ఊసే కేంద్రం ఎత్తకపోవడంతో బీఆర్ఎస్​పార్టీ కేడర్​ఒక్కసారిగా ఉస్సూరుమంటున్నది. కేంద్రం అంచనాలను పసిగట్టడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని కాస్త బాహాటంగానే శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను వీక్​చేయకపోగా.. సొంత పార్టీ గ్రాఫ్​కూడా డౌన్​అవుతున్నదని బీఆర్ఎస్​నేతలు ఆందోళన చెందుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ స్పెషల్ సెషన్ కారణంగా 20 రోజుల సమయం వృథా అయిందనే ఆవేదనలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రచారానికి విరామం ఇవ్వడం వల్ల తమకు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందని లెక్కలు తీస్తున్నారు. ఈ గ్యాప్‌లో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలపడేందుకు తామే అవకాశం ఇచ్చినట్టైందని అభిప్రాయపడుతున్నారు. అయితే పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎజెండాను పార్టీపెద్దలు పసిగట్టలేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని మాట్లాడుకుంటున్నారు.

ఊపందుకుంటోన్న టైమ్‌లో విరామం

నెల రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత రాష్ర్ట వ్యాప్తంగా ఆ పార్టీలో హడావుడి నెలకొంది. అభ్యర్థుల వద్దకు లీడర్లు, కేడర్ క్యూ కట్టి హంగామా చేశారు. అభ్యర్థులు సైతం గ్రామాల్లో వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాల పేరుతో మెల్లమెల్లగా ప్రచారం షురూ చేశారు. లోకల్ లీడర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోన్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సెషన్ డేట్స్ ప్రకటించారు.

ఆ సెషన్స్‌లో జమిలి ఎన్నికలు ఉంటాయని, అసెంబ్లీ ఎలక్షన్లు షెడ్యూలు మేరకు జరగకపోవచ్చని ఊహగానాలు వచ్చాయి. దీంతో ప్రచారానికి బ్రేకులు వేయాలని ప్రగతిభవన్ నుంచి అభ్యర్థులకు అదేశాలు వెళ్లడంతో లీడర్లందరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే పార్లమెంట్ సెషన్‌లో జమిలి ఎన్నికల అంశం ఎజెండాలో లేదని విషయాన్ని ముందుగా తెలుసుకోవడంలో తమ పార్టీ పెద్దలు విఫలం అయ్యారని, అందుకే ఈ కన్ప్యూజన్ నెలకొందని చర్చించుకుంటున్నారు.

మైలేజ్ దక్కని అభ్యర్థుల ప్రకటన

అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారంలో విపక్షాల కంటే ముందు వరసలో ఉండొచ్చని ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులు ప్రకటించారు. కాని ఈ విషయంలో కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టిందని టాక్ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో ఏం నిర్ణయాలు ఉంటాయో తెలియక, ప్రచారానికి, అసమ్మతి లీడర్లను బుజ్జగించే పనికి విరామం ఇచ్చారు.

దీంతో ఇప్పుడు మళ్లీ అన్ని పనులను మొదట్నించి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయలు లీడర్లలో ఉన్నాయి. త్వరలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి తెరలేపేందుకు కసరత్తు చేస్తున్నది. దీంతో ఆ పార్టీకంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, ప్రయోజనం లేకుండా పోయిందని అభిప్రాయాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ పుంజుకుందనే భయం

బీఆర్ఎస్ ప్రచారానికి విరామం ప్రకటించడం వల్ల కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సీడబ్యూసీ సమావేశాలు నిర్వహించడం, బహిరంగ సభలో సోనియా పాల్గొనడం వల్ల ఆ పార్టీ లీడర్లు, కేడర్లలో యాక్టివిటీస్ పెరిగాయి. వీటికి తోడు పబ్లిక్ మీటింగ్‌లో సోనియా సిక్స్ గ్యారంటీస్‌ను ప్రకటించడం వల్ల క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిందని బీఆర్ఎస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రచారానికి విరామం ప్రకటించడం వల్ల ఖర్చులు తగ్గినా, పార్టీ గ్రాఫ్ కూడా తగ్గిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉన్నపళంగా క్యాంపెయిన్‌కు బ్రేకులు వేడయంతో యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తల్లో నిరాశకు లోనయ్యారని, దళితబంధు, గృహలక్ష్మి, బీసీ సాయం లాంటి సంక్షేమ పథకాల అమలులో జాప్యం వల్ల ప్రజల్లో నెగిటివ్ పెరిగిందని టాక్ ఉంది.


Read More..

తుమ్మల, పొంగులేటి.. ఖమ్మం బరిలో ఎవరు? సోషల్ మీడియాలో జోరుగా చర్చ!

Advertisement

Next Story

Most Viewed