ఎట్టకేలకు ‘టీఆర్‌టీ’ ప్రకటన.. అయినా అభ్యర్థులు ఆగ్రహం

by GSrikanth |
ఎట్టకేలకు ‘టీఆర్‌టీ’ ప్రకటన.. అయినా అభ్యర్థులు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2017లో చివరి నోటిఫికేషన్ ఇచ్చిన సర్కారు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఖాళీలు మొత్తం భర్తీ చేయకుండా కేవలం 6 వేల పోస్టులే ఫిల్ చేయడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

4 లక్షల మంది అభ్యర్థులు

ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు శాఖల్లోని మొత్తం 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అందులో విద్యాశాఖ పరిధిలో మొత్తం 13,500 ఖాళీలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. కానీ ఇప్పుడు కేవలం 6,612 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు చెప్పడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల మందికిపైగా టీఆర్టీ రాసే అవకాశం ఉంది.

కొన్ని జిల్లాల్లో అతి తక్కువ పోస్టులు

2017లో టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో టీఆర్టీ నిర్వహించగా ఈసారి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల వారీగా, లోకల్ వాళ్లకు 95 శాతం, నాన్ లోకల్ అభ్యర్థులకు 5 శాతం ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన 6,612 పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1,739 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు 2575, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 611, పీఈటీ 164 ఉన్నాయి. మొత్తం 5,089 పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. కాగా మిగతా 1523 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులున్నాయి. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే నోటిఫికేషన్ ఆశ చూపుతున్నారని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.

నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి: రావుల రామ్మోహన్ రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

టీచర్ పోస్టుల అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. ఇదే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాం. సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశాం. అన్ని పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed