GO 46 : ప్రభుత్వాన్ని వదలం.. జీవో 46 రద్దు చేసే వరకు రణరంగమే.. రాకేష్ రెడ్డి ఫైర్

by Ramesh N |
GO 46 : ప్రభుత్వాన్ని వదలం.. జీవో 46 రద్దు చేసే వరకు రణరంగమే.. రాకేష్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీవో 46 రద్దు చేసే వరకు రణరంగం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జీవో 46 బాధితులను పోలీస్ స్టేషన్ లో కలుద్దామని వెళితే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజా భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కహానీలు చెప్పిందని, ప్రజాభవన్‌కు వెళ్లిన జీవో 46 బాధితులకు పిడిగుద్దులే మిగిలాయన్నారు. ఇష్టమొచ్చినట్టు జీవో 46 బాధితులను పోలీసులు దుర్మార్గంగా హింసించారని ఆరోపించారు. బాధితులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించ లేదన్నారు. జీవో 46 బాధితుల పక్షాన పోరాడుతామని కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఓ తెల్ల కాగితాన్ని జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందని విమర్శించారు. అయితే జాబ్ క్యాలెండర్‌లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదని, ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జారుకునే క్యాలెండర్ అని సెటైర్లు వేశారు. జాబ్ క్యాలెండర్‌పై తన మిత్రపక్షం డీఎంకేను చూసైనా ఇక్కడి కాంగ్రెస్ నేర్చుకోవాలని సూచించారు. 30 వేల ఉద్యోగాల భర్తీపై దమ్ముంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామా సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed