Bhadrakali : శాకంబ‌రి అలంక‌ర‌ణ‌లో భద్రకాళి అమ్మవారు

by Rajesh |
Bhadrakali : శాకంబ‌రి అలంక‌ర‌ణ‌లో భద్రకాళి అమ్మవారు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్‌ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు, శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఉదయం 3 గంటలకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. శాకంబరీ నవరాత్రుల చివరి రోజు భద్రకాళీని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గురుపౌర్ణమి కావడంతో భద్రకాళీ ఆలయ ప్రాంగణంలోని సాయిబాబా దేవాలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శాకంబరీ అలంకరణలో భాగంగా భద్రకాళీ అమ్మవారిని నాలుగు క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. న‌గ‌ర‌ ప్రముఖులతో పాటు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి అమ్మవారిని ద‌ర్శించుకునేందుకు వేలాది సంఖ్య‌లో భ‌క్తులు ఆల‌యానికి చేరుకున్నారు. క్యూలైన్లు కిక్కిరిసాయి. వ‌ర్షం ప‌డుతున్నా.. ఆల‌యానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో శేషు భారతి పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు.



Next Story