హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర.. ఏ పార్టీ వారైనా వదలొద్దు!: ఏపీ సీఎంకు బండిసంజయ్ లేఖ

by Ramesh N |
హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర.. ఏ పార్టీ వారైనా వదలొద్దు!: ఏపీ సీఎంకు బండిసంజయ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఎపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతోపాటు కల్తీ అయిన నెయ్యిని, చేప నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు శ్రీవారి భక్తకోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని పేర్కొన్నారు.

ఏపీ సీఎం వ్యాఖ్యలు నిజమేనని హిందూ సమాజం భావిస్తోంది

గత పాలకులు శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడుకొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని విమర్శలు వెల్లువెత్తినా స్పందించ లేదన్నారు. ఇటీవల ‘అన్నప్రసాదం నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారు.’ అని ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిజమేనని హిందూ సమాజం భావిస్తోంది.. అని లేఖలో పేర్కొన్నారు.

లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగం నీచం

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమన్నారు. ఒకవేళ అదే నిజమైతే హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే అనుమానిస్తున్నామన్నారు. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఇలాంటి కుట్రలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉన్నత స్థాయి వ్యక్తుల పాత్ర లేనిదే ఇంతటి నీచమైన పనిని నిరాటంకంగా ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు.

ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి

రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి ప్రపంచంలోని యావత్ హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని, దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే చట్ట ప్రకారం శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే పవిత్రమైన తిరుమల కొండపై ఇలాంటి నీచమైన, ఘోరమైన కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపించారు. ఇకపై అలాంటి వారికి టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమత ప్రచారం జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed