Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు!

by Ramesh Goud |
Assembly: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మండలి సమావేశాల్లో భాగంగా క్వషన్ అవర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు జీఓ నం. 25 ద్వారా గృహ నిర్మాణానికి 3 లక్షలు కేటాయిస్తూ.. 496 ఇళ్లకు ఫౌండేషన్ వేసిందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ జీవో ను రద్దు చేస్తూ.. ఆ 496 ఇళ్లకు కూడా 3 లక్షలకు బదులుగా 5 లక్షలు ఇస్తూ.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. దీనిపై తాతా మధు సప్లిమెంటరీ ప్రశ్న లేవనెత్తుతూ.. మంత్రి తెలిపిన సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని అన్నారు.

దీనికి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అది మేం తయారు చేసిన జాబితా కాదని, గత ప్రభుత్వం నుంచి అధికారులు సేకరించని డేటా అని చెబుతూ.. దానికి సంబందించిన లిస్ట్ ను చదివి వినిపించారు. ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2006 నుంచి 2014 వరకు తెలంగాణలో దాదాపు 19 లక్షల పై చిలుకు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసిందని, కానీ గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 1,36,116 ఇళ్లు పూర్తి చేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సగం పూర్తి అయ్యి మెండి గోడలతో ఉన్న ఇళ్లను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. ఇక పేద వాళ్లలో బహు పేదవాళ్లకే ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు.



Next Story