SP : ఆదివాసీ గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకే మెగా వైద్య శిబిరం

by Kalyani |
SP : ఆదివాసీ గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకే మెగా వైద్య శిబిరం
X

దిశ, ఆదిలాబాద్ : మారుమూల గ్రామాలలో, తండాలలో ఉంటున్న ఆదివాసీలకు వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం లోకారి గ్రామపంచాయతీ పరిధిలోని ఝరి గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మంగళవారం వైద్య శిబిరంను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా లోకారి గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, గ్రామస్తులు, గ్రామ పెద్దలు జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.

ఈ వైద్య శిబిరంలో ఎస్పీ కుటుంబ సభ్యులైన అన్న జిలాని, వదిన సనా ల ద్వారా శిబిరంలో పాల్గొని ఆదివాసీలకు ఉచితంగా వైద్య సేవలను అందించారు. ఈ వైద్య శిబిరంలో దాదిగూడ మండలంలోని దాదాపు 25 గ్రామాల లోని 800 మంది ప్రజలు, ఆదివాసీలు చికిత్సలు చేసుకొని అవసరమైన మందులు తీసుకున్నారు. వీరితో పాటు గాదిగూడ మండలంలోని మేడిగూడ, పునికాస, పోలామా, కుండి, పిప్రి,సార్వి, సాంగువి, లోకారి గ్రామాలలోని ప్రజలు ఇందులో పాల్గొన్నారు. వైద్య శిబిరంలో అమాయకులైన ఆదివాసీలకు ఆప్తమాలజీ, పీడియాట్రిషన్, డెంటల్, సర్జరీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, ఈ ఎన్ టి, కార్డియాలజీ లాంటి వాటిలలో వైద్య సేవలను ఉచితంగా అందించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీలు సమస్యలు చిన్నదిగా ఉన్నప్పుడే గుర్తించి వైద్యులను సంప్రదించి వైద్య సేవలను ఉచితంగా పొందాలని సూచించారు.

ఎలాంటి సందర్భంలోనైనా జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామాలలో ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్, ఏఎన్ఎం ల సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో ఉట్నూర్ డీఎస్పీ సిహెచ్ నాగేందర్, అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ కే మనోహర్, నార్నూర్ సీఐ రహీమ్ పాషా, ఎస్ ఐ ఎస్ మహేష్,వైద్యులు ప్రవీణ్, సంజీవ్, అభిజిత్, సాయినాథ్, భాగ్యలక్ష్మి, సోయబుద్ధిన్, ఆదర్శ రెడ్డి, నవీన్ గాండ్ల ,గోపాల్, నార్నూర్, గాదిగూడ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed