టీ బీజేపీలో కొత్త కన్ఫ్యూజన్.. ఎవరీ అభయ్..?

by karthikeya |
టీ బీజేపీలో కొత్త కన్ఫ్యూజన్.. ఎవరీ అభయ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కమలనాథులకు కొత్త భయం పట్టుకుంది. రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి విషయంలో పార్టీ శ్రేణులకు ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్‌చార్జిగా తనను నియమించారని అభయ్ పాటిల్ ఇటీవల ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఆ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ఎంటర్ కావలసి వచ్చింది. పార్టీ ఇన్‌చార్జిగా కొత్తగా ఎవరినీ నియమించలేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. అయితే, బీజేపీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో మాత్రం ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్ పేరు పెట్టింది. కానీ, అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదనేది సస్పెన్స్‌గా మారింది. ఆయనను వెబ్‌సైట్ వరకే ఎందుకు పరిమితం చేశారనేది ఆసక్తికరంగా మారింది.

అభయ్ మీటింగ్ అంటే లీడర్లకు జంకు!

తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్‌ను వెబ్‌సైట్ వరకే పరిమితం చేయడంతో టీ బీజేపీలో ఆయన రోల్ ఏంటనే ప్రశ్నలు శ్రేణుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అభయ్ పాటిల్.. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ఇన్‌చార్జిగా ఇక్కడ పనిచేశారు. గ్రౌండ్ లెవల్‌లో మైక్రో అబ్జర్వేషన్ చేశారు. ఆయన తీరు చాలా మంది నేతలకు అప్పట్లో నిద్ర పట్టనివ్వలేదు. ఆయన మీటింగ్‌కు వస్తున్నారంటే ఎవరైనా సరే జంకాల్సిందే. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా కొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. ఎవరో ఏమో అనుకుంటారని సందేహించకుండా అనుకున్నది చెబుతారు. ఆయన మీటింగ్‌కు సమయానికి రాకుంటే ఎంత పెద్ద నేత అయినా సరే.. అలస్యం చేస్తే గేట్ బంద్ చేసి మరీ హాజరైన వారితోనే కొనసాగిస్తారనే పేరుంది. పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా ఇక్కడి లీడర్లు పలువురు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. దీంతో ఆయన మీటింగ్ అంటే జంకాల్సిన పరిస్థితికి వచ్చింది. సమయానికి ఉండాలనే అలర్ట్ మొదలైంది.

ఇన్‌చార్జిగా పాటిల్‌ వద్దంటున్న కొందరు నేతలు!

బీజేపీ జాతీయ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించిన ఆయన తన దూకుడును అలాగే కొనసాగించారు. బీజేపీలో తాను ఫలానా వ్యక్తి శిష్యుడిని అని, తనను ఎవరేం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని తనదైన శైలిలో చురకలంటించారు. తాను ఎమ్మెల్యే అని, ఎంపీ అని బేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన సభ్యత్వాల టార్గెట్‌ను పూర్తిచేయాల్సిందేనని నొక్కిచెప్పారు. లేదంటే పదవులు పోతాయని హెచ్చరించారు. పనిచేయకుండా కబుర్లు చెప్పే లీడర్లకు ఆయనంటే అస్సలు గిట్టడం లేదని తెలుస్తోంది. అలాంటి వాళ్లను పాటిల్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరని సమాచారం. అయితే ఆయన విధానాలు పలువురికి నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే రాష్ట్ర ఇన్‌చార్జిగా ఆయన వద్దని ఇక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

సభ్యత్వ నమోదుపైనే ఫోకస్ పెట్టాను: అభయ్ పాటిల్

ఢిల్లీలో ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో అభయ్ పాటిల్ పేరు కర్ణాటక బీజేపీ జాబితాలో కనిపించలేదు. తీరా చూస్తే ఆయన పేరు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జిగా ఉంది. కానీ ఇక్కడి లీడర్లు మాత్రం ఆయన పార్టీ ఇన్‌చార్జే కాదని మీడియా వార్తలను ఖండిస్తూ పత్రిక ప్రకటనలు కూడా విడుదల చేశారు. తీరా సభ్యత్వ నమోదు కోసం తెలంగాణకు వచ్చిన ఆయన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వరకే ఉంటారని సర్దిచెప్పుకుంటున్నారు. ఈ విషయమై పాటిల్‌ను ప్రశ్నించగా తన ఫోకస్ ప్రస్తుతం సభ్యత్వ నమోదుపైనే ఉందని, తాను అందుకోసమే వచ్చినట్టు చెప్పడం గమనార్హం. దీంతో తెలంగాణ బీజేపీలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. రాష్ట్ర ఇన్‌చార్జి ఎవరో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్‌కు పార్టీ ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed