Paris olympics : హార్ట్ బ్రేక్.. భారత్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ముగ్గురూ ఔట్

by Harish |
Paris olympics : హార్ట్ బ్రేక్.. భారత్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ముగ్గురూ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : బాకింగ్స్‌లో నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సాత్విక్-చిరాగ్ జోడీ.. పారిస్ ఒలింపిక్స్‌‌లో పతకం తెచ్చే అథ్లెట్ల లిస్టులో వాళ్లది ముందు వరుస. ఏదో ఒక పతకమైతే తేవడం పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. స్వర్ణం తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకున్నారు. ఒలింపిక్స్ ముందు వారి ఫామ్ అలాంటిది మరి. తీరా, భారత అభిమానులకు హార్ట్ బ్రేక్.. అంచనాలు తలకిందులయ్యాయి. ఆశలు గల్లంతయ్యాయి. ఒత్తిడికి చిత్తయ్యారో.. కారణం ఏదైతేనేం నిఖత్, సాత్విక్, చిరాగ్ పతకం లేకుండానే ఇంటిదారిపట్టనున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం భారత్‌కు గట్టి షాక్‌లు తగిలాయి. భారీ అంచనాలు ఉన్న బాక్సర్ నిఖత్ జరీన్, స్టార్ షట్లర్ పీవీ సింధు, భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ నిష్ర్కమించారు. పతకం కచ్చితంగా తెస్తారనుకున్న వాళ్లు ఇంటిదారిపట్టడం ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్యపై ప్రభావం చూపనుంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్‌. అరంగేట్రంలోనే ఆమె సంచలనం సృష్టిస్తుందని చాలా మంది అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టే జరీన్ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో మాక్సీ క్లోట్జర్(జర్మనీ)ని 5-0 తేడాతో చిత్తు చేసి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే, ప్రీక్వార్టర్స్‌లో ఆమెకు కఠిన ప్రత్యర్థి ఎదురైంది. ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, టాప్ సీడ్ వు యు(చైనా) చేతిలో 5-0 తేడాతో నిఖత్ పరాజయం పాలైంది. నిఖత్ పోరాడినా.. ప్రత్యర్థి బ్రిలియంట్ ఫుట్‌వర్క్‌తోపాటు కచ్చితమైన పంచ్‌లతో పైచేయి సాధించింది. ఒత్తిడికి గురైన నిఖత్ పలు తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే, వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌కు ఒలింపిక్స్‌లో సీడింగ్ దక్కకపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ.. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌ను గుర్తించకపోవడంతో నిఖత్ విజయాలు లెక్కలోకి తీసుకోలేదు. సీడింగ్ దక్కి ఉంటే నిఖత్ నేరుగా ప్రీక్వార్టర్స్‌ నుంచి బరిలోకి దిగేది. అప్పుడు సెమీస్‌కు చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఇక, బాక్సింగ్‌ ఆశలన్నీ లవ్లీనా బోర్గోహైన్‌పైనే.

సాత్విక్ జోడీ ఖాళీ చేతులతో..

బ్యాడ్మింటన్‌లో ఎవరు పతకం తెచ్చినా తేకపోయినా భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ కచ్చితంగా మెడల్ తెస్తారని అంతా భావించారు. కొంతకాలంగా చిరాగ్‌తో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సంచలనాలు సృష్టించడమే పతక దీమా పెంచింది. అందుకు తగ్గట్టే భారత జంట దూకుడుగా ఆడింది. వరుసగా రెండు విజయాలతో భారత జంట గ్రూపు దశను అగ్రస్థానంతో ముగించి క్వార్టర్స్‌కు చేరుకుంది. తీరా, క్వార్టర్స్‌లో సాత్విక్, చిరాగ్ అంచనాలను అందుకోలేకపోయారు. క్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయ్ యిక్ సోహ్ చేతిలో 21-13, 14-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్‌‌లో సాత్విక్ జోడీదే శుభారంభం. అలవోకగానే తొలి గేమ్‌ను నెగ్గింది. ఆ తర్వాత ప్రత్యర్థులు పుంజుకోవడంతో తడబడి తప్పులు చేసిన భారత షట్లర్లు మిగతా రెండు గేమ్‌లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. దీంతో కచ్చితంగా పతకం తెస్తారనుకున్న సాత్విక్, చిరాగ్ ఖాళీ చేతులతోనే స్వదేశానికి రానున్నారు.

సింధు హ్యాట్రిక్ ఆశలు గల్లంతు

హ్యాట్రిక్ మెడలే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధుకు నిరాశే ఎదురైంది. ప్రీక్వార్టర్స్‌లోనే ఆమె వెనుదిరిగింది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో సింధు 19-21, 14-21 తేడాతో చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావో చేతిలో ఓడిపోయింది. తీవ్రంగా పోరాడినప్పటికీ సింధు ప్రత్యర్థి దూకుడుకు అడ్డుకట్టవేయలేకపోయింది. కాగా, సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫామ్ లేమితో, గాయాలతో సింధు తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతుంది. కానీ, పెద్ద టోర్నీలంటే విజృంభించే ఆమె పతకం తెస్తుందని అంతా భావించారు. గ్రూపు దశలో చెలరేగిన ఆమె వరుసగా రెండు విజయాలతో టాపర్‌గా నిలిచింది. కానీ, వరల్డ్ నం. 9వ ర్యాంకర్ ముందు సింధు నిలువలేకపోయింది.

Advertisement

Next Story

Most Viewed