న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా

by Harish |
న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్‌‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే తొలి టెస్టు నెగ్గిన ఆసిస్ తాజాగా రెండో టెస్టులోనూ ఆతిథ్య కివీస్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సోమవారం కివీస్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 162 పరుగులకే ఆలౌటవ్వగా..ఆస్ట్రేలియా 256 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని న్యూజిలాండ్ 372 పరుగులు చేసి ఆసిస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని మరో రోజు మిగిలి ఉండగానే ఆసిస్ ఛేదించింది. 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది.

ఓవర్‌నైట్ స్కోరు 77/4తో నాలుగు రోజు ఆట కొనసాగించిన కంగారుల జట్టు ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అలెక్స్ కేరీ(98 నాటౌట్), మిచెల్ మార్ష్(80) జట్టును ఆదుకున్నారు. కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ 6వ వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బెన్ సీర్స్ వరుస బంతుల్లో మిచెల్ మార్ష్‌తోపాటు మిచెల్ స్టార్క్(0)ను అవుట్ చేసి టెన్షన్ పెట్టాడు. అయితే, కెప్టెన్ పాట్ కమిన్స్(32 నాటౌట్), అలెక్స్ కేరీ ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలో బెన్ సీర్స్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మ్యాట్ హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. కాగా, టెస్టు సిరీస్‌కు ముందు కివీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా దక్కించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story