Champions Trophy : పాక్‌కు వెళ్లడంపై బీసీసీఐ స్పందన ఇదే

by Harish |
Champions Trophy : పాక్‌కు వెళ్లడంపై బీసీసీఐ స్పందన ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ టోర్నీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాక్‌కు వెళ్తుందా?లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ భారత జట్టును పంపేందుకు ఆసక్తి లేదని సమాచారం. భారత జట్టును పాక్‌కు పంపడంపై భారత ప్రభుత్వానిదే నిర్ణయమని బీసీసీఐ స్పష్టం చేసింది.

‘ఇంకా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, అంతర్జాతీయ పర్యటనల కోసం మేము ఎల్లప్పుడూ ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం. భారత జట్టు ఏ దేశానికి వెళ్లాలి, ఏ దేశానికి వెళ్లకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.’ అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా ఈవెంట్లలో మాత్రమే ఎదురుపడుతున్నాయి. చివరిసారిగా 2008లో జరిగిన ఆసియా కప్ కోసం భారత జట్టు పాక్‌కు వెళ్లింది. చాంపియన్స్ ట్రోఫీని ఆసియా కప్ తరహాలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed