జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రెజ్లర్లకు రైతుల మద్దతు

by Vinod kumar |
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రెజ్లర్లకు రైతుల మద్దతు
X

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు వారాలుగా నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లకు మద్దతు పలికేందుకు పోలీసుల బ్యారికేడ్లను దాటుకొని మరీ రైతు సంఘాల నాయకులు చొచ్చుకొచ్చారు. ఈక్రమంలో తమను అడ్డుకున్న పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. ఏదో ఒక విధంగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్న భారతీయ కిసాన్ మోర్చా (BKU) రైతులు.. రెస్లర్లను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. రైతులు, పోలీసుల మధ్య గొడవ జరిగిందని మీడియాలో వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. దీక్షా స్థలం వద్దకు రైతుల ప్రవేశాన్ని సులభతరం చేసేందుకు మాత్రమే పోలీసులు ప్రయత్నించారని పేర్కొంటూ న్యూఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్వీట్ చేసింది.

రైతుల సమూహాన్ని జంతర్ మంతర్‌కు తీసుకెళ్లేందుకు ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపింది. భద్రతా చర్యల్లో భాగంగా రైతులను మెటల్ డిటెక్టర్లలో చెక్ చేసిన తర్వాతే దీక్షా స్థలం దగ్గరికి పంపామని వెల్లడించింది. దీనిపై ఒక రైతు మీడియాతో మాట్లాడుతూ.. "మేము జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాం. అయితే పోలీసులు మమ్మల్ని ఒక వైపు నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళమన్నారు. మేం చాలా మందిమి ఉన్నాం.. కానీ అక్కడ సరిపడా స్థలం లేదు. ఈక్రమంలో గుంపుగా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యారికేడ్లు కింద పడ్డాయి" అని చెప్పాడు. కాగా, తమ నిరసనను ఎవరూ హైజాక్ చేయలేదని, మే 21లోగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకుంటే నిరసనను మరింత ఉధృతం చేస్తామని రెస్లర్ వినేష్ ఫోగట్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed