మరోసారి అదరగొట్టిన జ్యోతి జట్టు.. ఆర్చరీ వరల్డ్ కప్‌ల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్

by Harish |
మరోసారి అదరగొట్టిన జ్యోతి జట్టు.. ఆర్చరీ వరల్డ్ కప్‌ల్లో హ్యాట్రిక్  గోల్డ్ మెడల్
X

దిశ, స్పోర్ట్స్ : ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు మరోసారి అదరగొట్టింది. తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన భారత జట్టు వరుసగా మూడో బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటికే రెండు దశల్లో స్వర్ణం గెలిచిన జ్యోతి జట్టు.. తుర్కియేలో జరుగుతున్న స్టేజ్-3లోనూ గోల్డ్ మెడల్ దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి త్రయం 232-229(58-57, 57-57,59-58, 58-57) తేడాతో ఎస్టోనియా టీమ్‌ను ఓడించింది.

మ్యాచ్‌లో భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో సెట్‌లో డ్రా మినహా మిగతా మూడు సెట్లలో భారత ఆర్చర్లే నెగ్గారు. జ్యోతి జట్టుకు వరుసగా ఇది 13 విజయం కావడం మరో విశేషం. మరోవైపు, పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్‌లో ప్రియాన్షు రజతం సాధించాడు. సెమీస్‌లో ప్రియాన్షు 150-149 తేడాతో మాథియస్ ఫుల్లెర్టన్(డెన్మార్క్)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే, టైటిల్ పోరులో ప్రియాన్షు 148-149 తేడాతో మైక్ ష్లోసెర్(నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలై సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. వరల్డ్ కప్‌లో అతనికి ఇది రెండో పతకం. చైనాలో జరిగిన తొలి స్టేజ్‌లోనూ ప్రియాన్షు రజతం గెలుచుకున్నాడు.

Advertisement

Next Story