భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లు!

by Harish |
భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణ తగ్గి విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం కాస్త స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం తప్పదనే బలమైన సంకేతాలు కూడా మార్కెట్ల పై ప్రభావానికి కారణం అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో ఉదయం నుంచే నష్టాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు.. క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 660.63 పాయింట్లు దిగజారి 36,033 వద్ద ముగియగా, నిఫ్టీ 195.95 పాయింట్లు నష్టపోయి 10,607 వద్ద ముగిసింది. ఉదయం ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్ ఏకంగా 280 పాయింట్లకు పైగా నష్టాలతో మొదలైంది. తర్వాత అమ్మకాల ఒత్తిడిని భరించలేక సూచీలన్నీ కుదేలయ్యాయి. మంగళవారం కీలక రంగాలైన ఆటోమొబైల్, మెటల్, ఫైనాన్షియల్ రంగాల గణాంకాలు రావడం కూడా మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటోషేర్లు మాత్రమే లాభాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, పవర్‌గ్రిడ్ షేర్లు అత్యధిక నష్టాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Next Story