వైద్యులపై పోలీసుల ప్రతాపం

by srinivas |

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు వైద్యులపై ప్రతాపం చూపిన ఘటన ఆందోళనకు దారితీసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు తిరుపతిలో పోలీసులు పటిష్ఠంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ సమయంలో లీలామహల్ సెంటర్‌లో కొందురు మెడికోలు ఆసుపత్రులకు వెళ్తున్నారు. మెడికోలమని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. సరదాగా రోడ్లపై షికార్లకు వచ్చారని భావించి, వారిపై తమ ప్రతాపం చూపారు.

లాఠీ దెబ్బలు రుచి చూసిన వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స చేస్తుంటే, పోలీసులు అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని మండిపడుతూ, అక్కడే ధర్నాకు దిగారు. వారికి మరికొంతమంది వైద్యులు జతకలిశారు. వారంతా కలిసి తమపై చెయ్యి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, లీలామహల్ సెంటర్‌కు చేరుకుని వారికి సర్ది చెప్పారు. అయితే వారు వినిపించుకోకపోవడంతో శాఖా పరమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మెడికోలు ధర్నాను విరమించారు.

Tags: tirupati, leela mahal center, medicos, doctor, police attack on medicos

Advertisement

Next Story

Most Viewed