‘జాతీయపార్టీ’ పెట్టే ఆలోచన లేదు : కేసీఆర్

by  |
‘జాతీయపార్టీ’ పెట్టే ఆలోచన లేదు : కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణకు కొత్త రెవెన్యూ చట్టం వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారమే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈ చట్టా న్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో ప్రజలకు అవగాహన కలిగించాలని తమ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పలు అంశాల మీద మాట్లడారు. అసెంబ్లీ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి జాతీయ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ అవసరం ఏర్పడితే ముందుగా చెప్పే ఆ నిర్ణయం తీసుకుంటానని వివరించారు. అంతకు ముందు పార్టీలో సీనియర్ నేతలు సహా చాలా మందితో చర్చిస్తానని వివరించారని సమాచారం.

GHMCలో మనదే గెలుపు..

త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్పష్టం చేవారు. ఇప్పటికే పలు సర్వేలు చేయించానని, దాదాపు వంద స్థానాల్లో గెలుపు ఖాయమనే సంకేతాలే వచ్చాయని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అంతే ఉందని, ఆ పార్టీ నగరంలో చాలా బలహీనంగా ఉందని, రోజురోజుకూ మరింతగా వీక్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి సీట్ల గెల్చుకునేంత శక్తి లేదని, ఒకటి రెండు సీట్లు బీజేపీకి పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఊహించని స్థాయిలో 99 సీట్లు వచ్చినట్లే ఇప్పుడు కూడా నాలుగైదు ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

దగ్గుతో బయటకు వెళ్లిన నేత..

జలుబు, దగ్గు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎల్‌పీ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ వివరిస్తున్న సమయంలో జలుబు, దగ్గు ఎక్కువ కావడంతో, మిగిలినవారికి ఇబ్బంది కలగకుండా ఆయన వ్యవహరించారు. సమావేశం ముగిసేంతవరకూ లోపలికి రాలేదు. మంత్రి హరీశ్‌రావు కరోనా పాజిటివ్ కారణంగా అటు అసెంబ్లీకి, ఇటు ఎల్‌పీ సమావేశానికి హాజరు కాలేదు.


Next Story

Most Viewed