హేమంత్ సొరేన్‌కు షాక్: మనీలాండరింగ్ కేసులో మరో నలుగురి అరెస్ట్

by Dishanational2 |
హేమంత్ సొరేన్‌కు షాక్: మనీలాండరింగ్ కేసులో మరో నలుగురి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌కు మరో షాక్ తగిలింది. సొరేన్, తదితరులపై నమోదైన అక్రమ భూకబ్జా, మనీలాండరింగ్ సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో నలుగురిని అరెస్టు చేసినట్టు బుధవారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద టిర్కీ, ప్రియా రంజన్ సహాయ్, బిపిన్ సింగ్, ఇర్షాద్‌లను అరెస్టు చేసినట్టు పేర్కొంది. టిర్కీతో పాటు మరి కొందరి ఇళ్లలో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 8కి చేరుకుంది.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని 8.86 ఎకరాల భూమిని సొరేన్ అక్రమంగా కబ్జా చేశారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే జనవరిలో ఈడీ సొరేన్‌ను అరెస్టు చేయగా..ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అలాగే రెవెన్యూ శాఖ మాజీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ భాను ప్రతాప్‌ ప్రసాద్‌, మహ్మద్‌ సద్దాం హుసేన్, అఫ్సర్‌ అలీలను కూడా ఈడీ అరెస్టు చేసింది. మార్చి 30న పీఎంఎల్ఏ స్పెషనల్ కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా, ప్రభుత్వ రికార్డుల కస్టోడియన్‌గా ఉన్న భాను ప్రతాప్ ప్రసాద్‌ ఈ కేసులో ప్రధాన నిందితుడని ఈడీ పేర్కొంది. భూ కబ్జా వంటి కార్యకాలపాలలో సొరేన్, తదితరులు సహాయం అందించి తన అధికార పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించింది.

Next Story

Most Viewed