పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెల్లడించండి..ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by vinod kumar |
పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెల్లడించండి..ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ఫలితాలు ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను ఆదేశించింది. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నంలోపు వెల్లడించాలని తెలిపింది. అయితే విద్యార్థుల గుర్తింపును మాత్రం బహిరంగపర్చొద్దని స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ నరేంద్ర హుడా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్టీఏకు ఆర్డర్స్ జారీ చేసింది.

అలాగే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం పరీక్ష పవిత్రత కోల్పోయినప్పుడే, ఒక నిర్దిష్ట ప్రాతిపదికన మాత్రమే రీ-ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. పేపర్ లీక్ అనేది కొన్ని కేంద్రాలకు మాత్రమే పరిమితమైందా లేక విస్తృతంగా జరిగిందా అని ఎన్టీఏను ప్రశ్నించింది. పేపర్ లీక్, పరీక్షల మధ్య విరామం ఎక్కువైతే, అది తీవ్ర ఉల్లంఘనను సూచిస్తుందని అభిప్రాయపడింది. పరీక్ష తేదీ ఉదయం జార్ఖండ్ లోని హజారీబాగ్‌లో ఉన్న ఒక కేంద్రంలో మాత్రమే పేపర్ లీకైందని ఎన్టీఏ తెలిపింది. దీనిపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 180 ప్రశ్నలను 45 నిమిషాల్లో పరిష్కరించగలరా అని ఫైర్ అయ్యారు. తదుపరి విచారణను జూలై 22కి వాయిదా వేశారు. బిహార్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు వివరాలను కూడా అందజేయాలని ఆదేశించారు.



Next Story