రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్.. ప్రధాని మోడీ ఏమన్నారంటే?

by Shamantha N |
రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్.. ప్రధాని మోడీ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అసత్యాలు ప్రచారం చేసే వారికి నిజం వినే శక్తి లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోడీ విరుచుకు పడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడారు. అయితే, ప్రధాని ప్రసంగం సందర్భంగా జోక్యంచేసుకునేందుకు అనుమతివ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. కానీ, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేసహా ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”దేశం చూస్తోంది.. అబద్ధాలు ప్రచారం చేసేవారికి నిజం వినే శక్తి లేదు. సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేనివారు.. ప్రశ్నలకు సమాధానాలు కూడా వినలేరు." అన్నారు.

సోనియాపై మోడీ విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై ప్రధాని విమర్శలుచేయడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి." వీళ్లు ఆటో పైలట్, రిమోట్ పైలట్ మోడ్ లో ప్రభుత్వాన్ని నడిపేందుకు అలవాటు పడ్డారు. పని చేయడంపై నమ్మకం లేదు. కేవలం, ఎలా వేచి ఉండాలో మాత్రమే తెలుసు" అని మోడీ సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రధాని ప్రసంగంలో జోక్యంచే సుకోవాలని ఖర్గే సహా విపక్షాలు కోరాయి. అందుకు రాజ్యసభ ఛైర్మన్ అనుమతించకపోవడంతో వారు వాకౌట్ చేశారు.



Next Story