విజయ్ మాల్యాకు షాక్.. రూ.180కోట్ల రుణఎగవేత కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

by Shamantha N |
విజయ్ మాల్యాకు షాక్.. రూ.180కోట్ల రుణఎగవేత కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ.180 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ చేసింది. కోర్టు జూన్ 29న మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే దాని ఉత్తర్వు మాత్రం సోమవారం అందుబాటులోకి వచ్చింది. కాగా.. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. మాల్యా పరారీని ప్రస్తావించింది. మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ఈ కేసు సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. దివాలా తీసిన ఎయిర్‌లైన్స్ కింగ్‌ఫిషర్ ప్రమోటర్ విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.180 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యాను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతను లండన్‌లో ఉన్నాడు. అతన్ని అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఛార్జిషీటులో మాల్యాపై వచ్చిన ఆరోపణలు

విజయ్ మాల్యా 2007 నుంచి 2012 మధ్య కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నట్లు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. 2010లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విమానయాన రంగానికి ఏకమొత్తంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఎస్బీఐని ఆదేశించిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. దీని తరువాత, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో సహా 18 బ్యాంకుల కన్సార్టియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో మాస్టర్ డెట్ రీకాస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. విజయ్ మాల్యా తెలిసి మోసపూరిత ఉద్దేశంతోనే తిరిగి చెల్లింపులు చేయలేదని సీబీఐ ఆరోపించింది. దీంతో బ్యాంకుకు రూ.141.91 కోట్ల నష్టం, రుణాన్ని షేర్లుగా మార్చుకోవడం వల్ల రూ.38.30 కోట్ల అదనపు నష్టం వాటిల్లిందంది. మార్చి 2016లో భారత్‌ను వదిలిపెట్టారు. జనవరి 2019లో అనేక రుణ ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడిగా తేలారు.

Advertisement

Next Story