2029లో జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంలో కొత్త అధ్యాయం..లా కమిషన్ సంచలన సిఫారసులు

by Hajipasha |
2029లో జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంలో కొత్త అధ్యాయం..లా కమిషన్ సంచలన సిఫారసులు
X

దిశ, నేషనల్ బ్యూరో : 2029 జూన్ నాటికి దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనుందని తెలుస్తోంది. ఆ సమయానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో పోల్స్ నిర్వహించవచ్చనే సిఫారసు చేసేందుకు జస్టిస్ (రిటైర్డ్) రీతు రాజ్ అవస్తీ సారథ్యంలోని లా కమిషన్ సిద్ధమైందట. రాజ్యాంగ సవరణ ద్వారా జమిలి ఎన్నికలపై కొత్త అధ్యాయాన్ని లేదా కొంత భాగాన్ని రాజ్యాంగంలో చేర్చాలని అది సిఫారసు చేయనుందట. రాజ్యాంగంలోని అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడిన నిబంధనలను ఈ కొత్త అధ్యాయం భర్తీ చేస్తుందని అంటున్నారు. 2029 మే-జూన్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల శాసన సభలు, స్థానిక సంస్థలు పనిచేసే కాలాన్ని మూడు దశల్లో సమం చేయాలని లా కమిషన్ ప్రతిపాదించనుందని సమాచారం. ఇందులో భాగంగా తొలి దశలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అసెంబ్లీల కాల వ్యవధిని దాదాపు మూడు నుంచి ఆరు నెలలు తగ్గిస్తారు. 2029 వరకు ఏవైనా రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు కూలిపోతే సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాలని లా కమిషన్ సిఫారసు చేయనుందని అంటున్నారు. ఒకవేళ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఛాన్స్ లేకుంటే.. అసెంబ్లీకి మిగిలిన కాలం కోసం మాత్రమే మళ్లీ ఎన్నిక నిర్వహించాలని లా కమిషన్ సూచించనుంది. తద్వారా 2029 నాటికి అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాలు సమానం అవుతాయని భావిస్తున్నారు.రాజ్యాంగంలో చేర్చబోయే జమిలి ఎన్నికల కొత్త అధ్యాయంలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ నిబంధనలను పొందుపరుస్తారు. కామన్ ఎలక్టోరల్ సిస్టమ్ గురించి అందులో వివరిస్తారు.

Advertisement

Next Story

Most Viewed