Kangana Ranaut : అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చిన మాజీ ఎంపీ

by Hajipasha |
Kangana Ranaut : అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చిన మాజీ ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనకు దిగిన సమయంలో లైంగిక దాడి ఘటనలు కూడా జరిగాయి’’ అంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) మాజీ ఎంపీ సిమ్రాన్‌జీత్‌సింగ్‌ మాన్‌ భగ్గుమన్నారు. ‘‘నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రనౌత్‌ సాహెబ్‌కు రేప్‌లో చాలా అనుభవం ఉన్నట్టుంది. రేప్‌లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగొచ్చు. మీకు సైకిల్ తొక్కడంలో అనుభవం ఉన్నట్లే.. ఆమెకు రేప్‌లో అనుభవం ఉంది’’ అని ఆయన అనుచిత కామెంట్స్ చేశారు. సిమ్రాన్‌జీత్‌సింగ్‌ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కంగనా రనౌత్ స్పందించారు. ఈ దేశంలో అత్యాచారాలను చిన్నచూపు చూడటం ఎప్పటికీ ఆగదని అనిపిస్తోందన్నారు.

‘‘ఈరోజు ఆ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు. ఆడవాళ్లపై అత్యాచారాలు, హింసలు సరదా కోసం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. పితృస్వామ్య మనస్తత్వం వారిలో లోతుగా పాతుకుపోయింది’’ అని కంగన మండిపడ్డారు. ఉన్నత స్థాయి చిత్రనిర్మాత అయినా.. రాజకీయ నాయకురాలైనా.. ఎంతటి హోదాలో ఉన్నా మహిళలను వేధించడం కొంతమందికి అలవాటై పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సిమ్రాన్‌జీత్‌సింగ్‌ మాన్‌ వ్యాఖ్యలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కంగన భేటీ అయ్యారు. సొంత పార్టీ నుంచి ఆమె విమర్శలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed