Trump: భారత్ విధించే సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

by Shamantha N |
Trump: భారత్ విధించే సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA) అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అత్యధికంగా పన్నులు విధిస్తోందని అన్నారు.తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం పన్ను విధిస్తోందని, బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా మార్చాలనేది నా ప్లాన్. మనం సాధారణంగా టారిఫ్‌లు వసూలు చేయం కాబట్టి నా ప్లాన్‌లో ఇది చాలా ముఖ్యమైన పదం. నేను ఆ ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 పర్సెంట్ టారిఫ్‌ను వసూలుచేస్తుంది. బ్రెజిల్ విషయంలో పరిస్థితి అలాగే ఉంది. వీటన్నింటికంటే భారత్‌ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోంది. అయితే, అమెరికాకు భారత్‌తో సత్సంబంధాలున్నాయి. మోడీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి’’ అని ట్రంప్ అన్నారు.

ఇంధన ధరలపై..

అలాగే ఇంధన ధరల గురించి కూడా ట్రంప్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ రానున్న 12 నెలల్లో ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను సగం తగ్గిస్తాను. విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం. దీంతో, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికాలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’’ అని రాసుకొచ్చారు. ఇకపోతే, నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పోటీ పడుతున్నారు.

Advertisement

Next Story