రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

by karthikeya |
రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌‌సభ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చంపడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ (BJP) నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, వారి నుంచి తమ నాయకుడికి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్‌ (Tuglag Road)పీఎస్‌లో తమ ఫిర్యాదును అందజేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్‌ (Election Commission)కు కూడా పంపినట్లు ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. గత బుధవారం బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్‌ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని, ‘రాహుల్! బుద్ధి మార్చుకో. లేదంటే మీ నానమ్మకు పట్టిన గతే నీక్కూడా పడుతుంది’ అంటూ ఓపెన్‌గానే డెత్ థ్రెట్స్ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే, సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి రూ.11 లక్షలు బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

ఈ విధంగా బీజేపీ, ఆ పార్టీ మిత్ర పక్షాలకు చెందిన నేతలు బహిరంగంగానే రాహుల్ గాంధీకి ప్రాణహాని తలపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీపై ఎన్డీఏ పార్టీలకు ఉన్న ద్వేషాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అజయ్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతినడమే కాకుండా సాధారణ ప్రజల మధ్య వైరాన్ని పెంచుతుందని, ఆందోళనలకు దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్ష పార్టీల కూటమి ఎన్డీఏపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను అజయ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed