బైక్‌ను ఢీకొట్టిన బ్రిజ్ భూషణ్ సింగ్ కొడుకు కారు.. ఇద్దరు మృతి

by Harish |
బైక్‌ను ఢీకొట్టిన బ్రిజ్ భూషణ్ సింగ్ కొడుకు కారు.. ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో బుధవారం ఉదయం టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కారు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి కారణమైన కారు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ కొడుకు, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌దిగా పోలీసులు గుర్తించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్‌కు సమీపంలోని కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌ వెళుతుండగా, దానిలోని పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉన్న ఫార్చ్యూనర్ కారు వేగంగా ప్రయాణిస్తూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న 17 ఏళ్ల రెహాన్, 24 ఏళ్ల షాజాదే అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన తరువాత కారు పాదచారులపై దూసుకెళ్లగా సీతాదేవి అనే మహిళకు గాయలయ్యాయి. గాయపడిన ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటన జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన అక్కడి ప్రజలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని చుట్టుముట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు తీవ్రంగా రోదిస్తూ, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మృతుడు రెహాన్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కాన్వాయ్‌లో కరణ్ భూషణ్ సింగ్ ప్రయాణించాడా లేదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

Advertisement

Next Story