జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి

by S Gopi |
జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాదులు దాడులు కొనసాగుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో రెండోసారి ఆర్మీ వాహనాలపై దాడులతో రెచ్చిపోయారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా మచెడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై సోమవారం జరిగిన ఘోరమైన ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఇండియన్ ఆర్మీ 9 కార్ప్స్ పరిధిలో జరిగింది. రక్షణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా నుంచి 150 కి.మీ దూరంలో ఈ దాడి జరగ్గా, ఆ సమయంలో ఆర్మీ వాహనాలు మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సాధారణ పెట్రోలింగ్‌లో నిర్వహణలో ఉన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పుల నేపథ్యంలో అధికారులు అదనపు బలగాలను పంపించారు. ఉగ్రవాదులు కొండపై నుంచి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. గ్రెనెడ్లు కూడా విసిరారని సంబంధిత అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత మన సైనికులు కూడా ప్రతీకారం తీర్చుకున్నారని, దాంతో ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. అనంతరం బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. జూన్ 11,12 తేదీల్లో దోడా జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేశారు. జూన్ 11న చత్తర్‌గలా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి కారణంగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, జూన్ 12న గండో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత యాంటీ-టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.. నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. జూలై 7(ఆదివారం) కూడా రాజౌరి జిల్లాలోని మజాకోట్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఆర్మీ సిబ్బందికి గాయాలు కావడంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇప్పటికే విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed