‘మలిపెద్ది మడతపేచీ’ పై దుమారం.. ట్విట్టర్ లో బాధితుల ఫిర్యాదు

by Anukaran |
‘మలిపెద్ది మడతపేచీ’ పై దుమారం.. ట్విట్టర్ లో బాధితుల ఫిర్యాదు
X

దిశ, ఘట్‌కేసర్ : బాధితులకు అండగా నిలువాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో అమ్మిన భూములను అప్పనంగా కొట్టేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అధికారులు సైతం పాలకులకు వంతపాడడంతో బాధితులు ‘దిశ’ను సంప్రదించారు. ఈ నేపథ్యంలో సోమవారం దిశ దినపత్రికలో ప్రచురితమైన ‘మలిపెద్ది మడతపేచీ’ కథనం పెను దుమారాన్ని రేపింది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిల కుటుంబ సభ్యుల భూ బాగోతంపై ‘దిశ’ అందించిన కథనంపై విస్తృతంగా చర్చ నడించింది.

‘భూ’ మాయ..

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని ప్రతాప సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 315,316,317 లో ఉన్న మలిపెద్ది బుచ్చిరెడ్డి 27.17 ఎకరాల స్థలాన్ని 1989లోనే పంచాయితీ లే అవుట్ వేసి ప్లాట్లుగా విక్రయించాడు. ఆ లే అవుట్ లోనే ప్లాట్లను ప్రాగా టూల్స్ ఉద్యోగులు, ఉస్మానియా దవాఖానాలో పనిచేసే ఉద్యోగులు కొనుగోలు చేశారు. ప్లాట్ల కోసం తీసుకున్న రుణాలను సైతం క్లియర్ చేశారు. కొనుగోలుదారులు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకొని భవన నిర్మాణాల కోసం 1989 నుంచి 2018 వరకు గ్రామ పంచాయితీ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ వెంచర్ లో ముగ్గురు ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. మరి కొద్దరు హద్దులు ఏర్పాటు చేసుకొని బేస్ మెంట్స్ కట్టుకున్నారు. కొంతమంది ప్లాట్లను విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఇద్దరు, ముగ్గురి చేతులు కూడా మారాయి. అయితే నాటి తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి సహకారంతో రెసిడెన్సీయల్ జోన్ లో ఉన్న స్థలాన్ని అగ్రికల్చర్ జోన్ లోకి మార్చారు.

మలిపెద్ది కటుంబ సభ్యులకు తిరికి పాస్‌బుక్‌లను జారీ చేసి స్థలాన్ని వివాదంలోకి నెట్టారు. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన వారికి రైతు బంధు అందేలా ప్రభుత్వం వ్యవహారించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను తిరిగి దక్కించుకునేందుకు బాధితులంతా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. చివరికి న్యాయ పోరాటానికి దిగారు. రెవెన్యూ ట్రిబ్యునల్ లో కేసు వేయడంతో.. ఇటివలే కోర్టును అశ్రయించాలని తీర్పు నిచ్చింది. బాధితులంతా న్యాయంకోసం కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగగా, స్థానిక తాహసీల్దార్ విజయలక్ష్మి అక్రమంగా పాస్‌బుక్‌లను ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే 8 మంది రైతులు తమకు ఇచ్చిన పాస్ పుస్తకాలను రద్దు చేయాలని రాసిచ్చినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రైతుల అభ్యర్థనను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్విట్టర్ లో ఫిర్యాదు..

బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు ట్విట్టర్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. సోమవారం దిశలో ప్రచురితమైన కథనానికి సంబంధించిన క్లిప్పులతో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ట్విట్టర్ లో ఫిర్యాదు చేస్తున్నారు. కలెక్టర్ విచారణలో కూడా అక్కడ ప్లాట్లు ఉన్నట్లు తేలిందని, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల అండతో అక్రమార్కులు దొంగ పాస్ బుక్ లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed