యువతకు ఆదర్శవంతమైన నవల

by Ravi |   ( Updated:2024-08-04 18:45:26.0  )
యువతకు ఆదర్శవంతమైన నవల
X

తమ పనిలో తాను నిమగ్నమై ఉంటూ, తాను రాసిన నవల గుర్తింపు కోసం ఎక్కడ ప్రచారం చేసుకోని రచయిత డా.వెన్నం ఉపేందర్. ఆయన రాసిన 'మత్తడి దునికిన కోపుల నీళ్లు' నవల తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారం అందుకోవడం ద్వారా తెలంగాణ భాషకు,యాసకు పట్టం కొట్టినట్టైంది. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన విధానంలో తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గం అనుసరించిన తీరు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పవచ్చును.

మరణ మెప్పుడూ శూలంతో కుచ్చిన వేదనే... మరణాన్ని మరల మరల అనుభవించిన నాకు, చిగురించడం కూడా తెలిసింది. అంటున్న 'మత్తడి దునికిన కోపుల నీళ్లు' నవలా రచయిత పేరు డా.వెన్నం ఉపేందర్. వారి తల్లిదండ్రులు అనసూయ, వెంకటేశం గార్లు. వీరిది ఉమ్మడి నల్గొండ జిల్లా నందు మారుమూల కుగ్రామం, గుమ్మడివెళ్లి అనే ఊరు. 1978 సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన కరువు వీరి జీవితాలను దుర్భర పరిస్థితుల్లోనికి నెట్టివేసిందట.

ఎడారిలో పచ్చని కోరిక

పేదరికం తీరుతెన్నులు ఎంతో మంది ముఖచిత్రాలను చిదిమేస్తుంటే.. చదువుకోవాలనే పచ్చని కోరికను ఎడారిలా మార్చేస్తుంటే.. మా ఇండ్లకు మసిపేలికాలు తోరణాలుగా దర్శమిస్తుంటే. నూరేళ్లు బతకాలన్న ఆశ సగం ఆయుష్షు దరి చేరకుండా. పాతికేళ్లకే ముఖం మీద ముడతలతో కాటికి కాళ్లు చాపుతుంటే. ఇక మీరు ఎలా తల్లిదండ్రులను ఉద్ధరించేదంటూ పేదింటి పిల్లల్ని వెంటాడే సమాజం మాట!

కొంత మంది జీవితాలు గురించి చెప్పితే తరగని ముచ్చట్లు.. అవన్నీ కన్నీళ్ల జాడలే.. వాళ్లు అనుభవించి బతికిన క్షణాలు.. ఆ బాధలు ...నెమరేసుకుంటే మింగుడు పట్టక నాలుక మీద బరువైతాయి .వెలుగు విలువ తెలవాలంటే జీవితం కీకారణ్యంలో సాగాలి కదా! అనుభవానికి మించిన గురువెవ్వరు లేరన్న రచయిత మాట నిజమే కదా!

నాలుగు రోడ్లు నలభై రకాలుగా చీలినా

అక్షరీకరించబడిన జీవితం/కాలే కడుపుకు కాసిన్ని నీళ్లు, సలిపించే గాయనికి కాసింత పశు మూత్ర పూత/నీ వల్ల గాదన్న నిచ్చెన ఎక్కి తీరాలి.. నాలుగు రోడ్లు, నలభై రకాలుగా చీలిపోయినా, అందులో ఎల్లవేళలా నమ్ముకోదగింది చదువు అని చెప్పుతూ గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలి.ఎన్ని అడ్డుగోడలు ఎదురైనా, చదువుని నిర్లక్ష్యం చేయొద్దని ఇందులో వారిచ్చిన సలహా.

ముగింపు లేని ఎలిజీలా..

అనాథలా జీవనం - చితికిన పసితనం/బతుకంటేనే పోరాటం/జీవంతో ఉన్న ఏ జీవికిది అతీతం కాదు. పోరాటం చివరి అంకంలో ఉన్నప్పుడు మనిషి పడే ఘర్షణ అంతా ఇంతా కాదు అంటారు/యూనియన్ పబ్లిక్ సర్వీస్ భవన్ వారి అనుభవం/సర్కారు బడిల అయిదో తరగతి/హై స్కూలు చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు/ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊరికి ,ఎనిమిదో తరగతి కోసం కాలి బాటలో పొలం ఒరాలపై పోతుంటే కసిదీర గుచ్చుకున్న తున్నముండ్లు/పిడికెడన్నం కరువైనోలు శాన మందితో కలిసి రెండు ముద్దల బువ్వ దొరుకుతదని సరి పోయినంత చదుకోవచ్చన్న ఆశకు ప్రభుత్వ హాస్టల్ ప్రాణం పోసింది/నెలకి సబ్బుల బిల్లుల కింద మంజురయ్యే నాలుగు రూపాయలకు లైఫ్ బాయ్ సబ్బోచ్చేది.దాన్ని ముక్కలు ముక్కలుజేసుకుని, ఆర్నెల్లు వాడుకునేవాడిని/ మా ఊరు,మా ఇల్లు - ఎప్పటికీ ఒడవని ముచ్చట/మా ఊరంటే గుప్పడు మనస్సులో ఇమడిన గోస నరనరా జలజలా పారే ఎండమావి బుంగ. ముగింపు లేని ఓ ఎలిజీలా కలుక్కుమంటుంది. ఊళ్లలో నివసించే ప్రజలు పడే బాధలు, కష్టాలు, కుల వృత్తులను, రైతు కుటుంబంలో కలిగే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చెప్పినారు. తెగి అతికిన ఇంటరు - కంట అలుగు బోసిన కన్నీరు/పది సదువు కాగానే: “మీ వోడు పది సదివిండు.. పిలగాడు బాగానే సదివిండు. ఉద్యోగం యేడోస్తదని ..యేదన్న పనిలో కుదురమని...ఓ మోటార్ సైకిల్ రిపేర్ పనిలో నాలుగు పైసలు వస్తాయని బయట వాళ్ళు ఇచ్చిన సలహాలు ఒక వైపు..

చదువు.. కడుపు నింపిన ఆదరువు

నువ్వు సదువు కోవాలి బిడ్డ.. సదివి నువ్వు కొవ్వొత్తి గావాల.. నలుగురికీ వెలుగు పంచాల ఈ బాధలు అన్నీ నేను చూసుకుంటా. నువ్వు రంధి పెట్టుకోకు వారి అమ్మ ఇచ్చిన అభయం మరో వైపు..ఇంటర్ చదవాలంటే 40 కిలోమీటర్ల దూరం/ఇంజినీరింగ్ సదువు - కడుపు నింపిన ఆదరువు/ ఇంజినీరు కాలేజీలో సీటు వచ్చింది కానీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేక వారు పడ్డ కష్టాలు.

కుటుంబ తల్లి వేరు - చింత చెట్టు అన్నట్లుగా /ఇంటి చింత చెట్టు, తానిచ్చే చింతపండుతో నాలుగు సంవత్సరాలు తల్లి, కొడుకును పోషించింది. ఎవరో ఇచ్చిన ఖాకీ రంగు ప్యాంటు, అది ఒదుకులుగా ఉండటంతో పీన్నీసు పెట్టి కట్టుకొని/మడతలు పడి మాసిన అంగీతో ఇంజనీర్ చదువు కోసం వెళ్లిన పరిస్థితి /సింగరేణి నుంచి సివిల్స్ దాకా/ఇంజినీరింగు చదువు అయిపోయింది కానీ, వెంటనే ఉద్యోగం రాలేదు అయిన ఏ మాత్రం కుంగిపోకుండా కఠోర శ్రమతో కార్యదీక్షతో సివిల్స్ ఉద్యోగం సాధించారు. కృషి పట్టుదల కలిగిన డా.వెన్నం ఉపేందర్ వ్యక్తిత్వం, పేద మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.

1. సదువుకు.. ఆకలికి ముడి పెట్టవద్దు .. 2. ఇవ్వాళ పోతే రేపు రెండో రోజు.. 3. చెరువు ఎప్పటికీ ఎండే ఉండదు… 4. కష్ట మెదురైతే చేసేదేమీ లేదు.. ఇష్టంగా ఎదుర్కోవడమే..డా.వెన్నం ఉపేందర్ జీవితాన్ని చక్కని నవలగా రచన చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన వారి కలం నుండి మరిన్ని రచనలు జాలువారాలని మనసారా కోరుకుంటూ,

పుస్తకం: మత్తడి దునికిన కోపుల నీళ్లు

రచయిత: డా.వెన్నం ఉపేందర్

పేజీలు:143

వెల: రూ.100

ప్రతులకు:

94412 68861


సమీక్షకులు

కొండేటి ప్రకాష్

7981781086.

Advertisement

Next Story

Most Viewed