మంత్రి ఎర్రబెల్లికి కాటన్ కార్పొరేషన్ ప్రతినిధుల లేఖ

by Shyam |
మంత్రి ఎర్రబెల్లికి కాటన్ కార్పొరేషన్ ప్రతినిధుల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు మూడు దశాబ్దాలుగా వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాటన్ కార్పొరేషన్‌కు చెందిన ప్రాంతీయ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల గజాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఏటా లక్షలాది మంది రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పత్తి కొంటున్న తమ సంస్థ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటివరకు స్వంత భవనం లేదని, అద్దె భవనం నుంచే నిర్వహణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రెండు వేల గజాల స్థలాన్ని ఇచ్చినట్లయితే స్వంత నిధులతో భవనాన్ని, లాబ్‌ను, సమావేశ మందిరాన్ని కట్టుకుంటామని ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాధరెడ్డి మంత్రి ఎర్రబెల్లికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో సుమారు 47,677 టన్నుల మేర పత్తిని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించిన రూ. 2,716 కోట్ల మేర చెల్లింపులు కూడా జరిగాయని అమరనాధ్ రెడ్డి మంత్రికి వివరించారు. సుమారు 2.28లక్షల మంది రైతుల నుంచి పత్తిని కనీస మద్దతు ధరకే కొన్నామని, ప్రైవేటు వ్యాపారులకు నష్టానికి అమ్ముకునే చర్యలను నివారించగలిగామన్నారు. వరంగల్ కేంద్రంగా కాటన్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ద్వారా సుమారు 90మంది సిబ్బంది కేవలం పత్తి కొనుగోలు అవసరాల కోసమే పనిచేస్తున్నారని, ఎక్కడా రైతులకు ధర విషయంలో అన్యాయం జరగకుండా తమ సంస్థ సంతృప్తికరమైన పాత్రను పోషంచిందని మంత్రికి డిప్యూటీ జనరల్ మేనేజర్ వివరించారు.

Advertisement

Next Story