మురుగు ఇక మెరుగు

by Shyam |
మురుగు ఇక మెరుగు
X

దిశ, న్యూస్‌ బ్యూరో: గ్రేటర్ పరిధిలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం నగర సేవరేజ్ వ్యవస్థ, ఎస్టీపీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతమున్న సేవరేజ్ వ్యవస్థ, ఎస్టీపీలు, రానున్న రోజుల్లో నిర్మించే ఎస్టీపీల సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నూతన ఎస్టీపీల నిర్మాణానికి స్థలం కోసం అన్వేషించకుండా ఇప్పటికే ఉన్న ఎస్టీపీల ప్రాంతంలోనే నూతనంగా నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. నూతన ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిధులు సేకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫంక్షన్ హాళ్లు, హోటల్స్, హాస్టల్స్, ఆసుపత్రి లాంటి వాణిజ్య భవనాలకు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకునేలా అవగాహన పెంచాలని సూచించారు. సిల్ట్ ఛాంబర్లు లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల వంద అంత కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లు తప్పనిసరిగా ఎస్టీపీ నిర్మించుకోవాలని మున్సిపల్ చట్టంలో ఉందని మంత్రి తెలిపారు. అలాంటి ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్లు ఎన్ని ఉన్నాయో… వాటిల్లో ఎన్నింటిలో ఎస్టీపీలు నిర్మించారో నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఎస్టీపీలు నిర్మించుకోని అపార్ట్‌మెంట్లపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిశోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed