జోనల్ కౌన్సిల్‌కు సిద్ధం.. ప్రత్యేక హోదాయే అజెండా

by srinivas |
జోనల్ కౌన్సిల్‌కు సిద్ధం.. ప్రత్యేక హోదాయే అజెండా
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రం దృష్టికి మరోసారి గట్టిగా తీసుకెళ్లాలి. అలాగే పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలు అయ్యేలా చొరవ చూపాలని కేంద్రాన్ని కోరాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు..పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు, నిధులు విడుదలచేసేలా ఒత్తిడి పెంచాలని మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

విభజన చట్టంలోని అంశాలపై చర్చించండి

సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని, తద్వారా సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షత జరగనున్న ఈ కౌన్సిల్‌ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తోందని వెల్లడించారు.

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు.. ఇతర అంశాలను అజెండాలో పొందుపరచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూలోటు, రేషన్‌ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లయ్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సీఎం జగన్ సూచించారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.

నదుల అనుసంధానంపై చర్చ

కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని సీఎం జగన్ తెలిపారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రతిపాదనలపై కూడా చర్చించారు. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ప్రత్యేక ఆహ్వానం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ డా.సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story

Most Viewed