ప్రైవేటు హాస్పిటళ్లకు టీకాలు ఎలా లభిస్తున్నాయి?- ఢిల్లీ డిప్యూటీ సీఎం

by vinod kumar |   ( Updated:2021-05-29 09:35:35.0  )
ప్రైవేటు హాస్పిటళ్లకు టీకాలు ఎలా లభిస్తున్నాయి?-  ఢిల్లీ డిప్యూటీ సీఎం
X

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టడం లేదని, సజావుగా నిర్వహించలేకపోవడం వల్లే యువత టీకాలు పొందలేకపోతున్నదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. రాష్ట్రాలకు లేని టీకా డోసుల స్టాక్, ప్రైవేటు హాస్పిటళ్లకు ఏ విధంగా సప్లై అవుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు కేంద్రం అందిస్తున్న టీకా డోసుల రికార్డును వెల్లడించాలని, ప్రైవేటు హాస్పిటళ్లకు, రాష్ట్రాలకు కంపెనీల నుంచి జరుగుతున్న కేటాయింపుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల్లేవని కంపెనీలు చెబుతున్నాయని, అవే కంపెనీల నుంచి ప్రైవేటు హాస్పిటళ్లకు వ్యాక్సిన్లు చేరుతున్నాయని అన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లు యువతకు అధిక ధరలకు ఆ టీకాలను వేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణాలోపంతోనే ఢిల్లీ యువత టీకాలు పొందలేకపోతున్నదని విమర్శించారు.

టీకా కొరతతో 18 నుంచి 44 ఏళ్ల వారికి పంపిణీని గతవారమే నిలిపేసిన ఢిల్లీకి జూన్‌లో 5.5 లక్షల డోసులు కేంద్రం నుంచి అందనున్నాయి. ఈ డోసులు కూడా జూన్ 10 వరకు ఢిల్లీకి రావని సిసోడియా అన్నారు. అప్పటి వరకు వారికి టీకా పంపిణీ ఉండదని చెప్పారు. ఢిల్లీలోని 92 లక్షల యువతకు టీకా వేయడానికి 1.84 కోట్ల డోసులు అవసరమవుతాయని వివరించారు. ఇందులో ఏప్రిల్‌లో 4.5 లక్షల డోసులు, మేలో 3.67 లక్షల డోసులు కేంద్రం అందించిందని, 8.17 లక్షల డోసులను కంపెనీల నుంచి సేకరించగలిగామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed