మోసపోయిన నటి కమ్ ఎంపీ.. చివరికి ఊహించని ట్విస్ట్

by Anukaran |
fake vaccine cheating case
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. అంతకుముందు బ్యాంకులు, ఏటీఎంలు అంటూ మోసం చేసేవారు. ఇప్పుడు వ్యాక్సిన్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే నిర్మాత సురేష్ బాబు వద్ద వ్యాక్సిన్ పేరుతో లక్ష రూపాయలు కాజేసాడో కేటుగాడు. ఆ విషయం మరువకముందే వ్యాక్సిన్ పేరుతో ఏకంగా ఓ ఎంపీనే బురిడీ కొట్టించాడు మరో కేటుగాడు. తాను ఐఏఎస్ ఆఫీసర్ ని అని చెప్పి తృణమూల్ ఎంపీకే టోకరా వేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఎంపీ తెలివితో కేటుగాడు బండారాన్ని బయటపెట్టిన ఘటన బెంగాల్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

బెంగాల్‌లో ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపు గుట్టును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి బయటపెట్టారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాకి దగ్గరలో కాస్బా ప్రాంతంలో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టామని, ఆ కార్యక్రమానికి అతిధిగా రావాలని టీఎంసి ఎంపీ మిమి చక్రవర్తిని, దేబాంజన్ దేవ్‌ అనే ఐఏఎస్ ఆఫీసర్ కోరాడు. దీంతో ప్రజలకు మంచే జరుగుతుంది కదా అని ఒప్పుకున్న ఎంపీ ఆ డ్రైవ్ కి హాజరై వ్యాక్సిన్ కూడా తీసుకొంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకునేముందు ఆధార్ కార్డు, వివరాలు అడగకపోవడం, టీకా తీసుకున్నాకా ఫోన్ కి మెసేజ్ రాకపోవడంతో మిమికి అనుమానమొచ్చింది. ఆ తర్వాత దేబాంజన్ దేవ్‌ ను టీకా సర్టిఫికెట్ అడిగితే పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానించిన ఎంపీ అనుచరులతో విచారణ చేయించారు. విచారణలో దేబాంజన్ దేవ్‌ అసలు ఐఏఎస్ అధికారి కాదని తేలడంతో ఎంపీ అవాక్కయ్యింది. అనంతరం ఆ క్యాంపు నిర్వహకుడుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంపీ మిమి చక్రవర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు దేబాంజన్ దేవ్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్యాంపులో సుమారు 250 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని, అయితే వారికి ఇచ్చిన వ్యాక్సిన్లు నకిలీవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు తెలుపుతున్నారు. ఏదిఏమైనా ఏకంగా ఎంపీనే బురిడీ కొట్టించిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది .

Advertisement

Next Story