పోలీసులనే చంపేశారు.. ఏమైందంటే?

by  |
పోలీసులనే చంపేశారు.. ఏమైందంటే?
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు చెలరేగిపోయారు. 60 కేసులున్న ఓ నేరస్తుడిని అరెస్టు చేయడానికి వెళ్తున్న పోలీసులపై గుళ్ల వర్షం కురిపించారు. దీంతో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీతోపాటు ఏడుగురు పోలీసులు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురు ఇతరులు గాయపడ్డారు. కాన్పూర్‌లోని దిక్రూ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అదనపు డీజీ సహా ఐజీ, ఎస్ఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరారు. ఫోరెన్సిక్ బృందమూ చేరింది. ఘటనపై సమగ్ర రిపోర్టు వెంటనే అందించాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటన నేరస్తులకు అధికారంలోని నేతలకున్న సంబంధాన్ని వెల్లడిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు సర్కారుపై విమర్శలు కురిపించాయి.

పోలీసుల వివరాల ప్రకారం, 60 క్రిమినల్ కేసులున్న వికాస్ దూబేను అరెస్టు చేయడానికి పోలీసు బృందం చౌబెపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దిక్రూ గ్రామానికి గురువారం రాత్రి వెళ్లింది. నేరస్తులను సమీపిస్తుండగానే మాటువేసి ఓ బంగ్లా పై నుంచి వారు పోలీసులపై గుళ్ల వర్షం కురిపించారు. పోలీసులు వస్తున్నట్టు క్రిమినల్ దూబెకు ఉప్పంది ఉండొచ్చని యూపీ డీజీపీ హెచ్‌సీ అవస్తీ తెలిపారు. దూబె, అతని అనుచరులు ఆ దారి గుండా అడ్డంకులు సృష్టించారని, ఇదేమీ గమనించకుండా పోలీసులు వెళ్లిపోయారని వివరించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్టు తెలిపారు. కాగా, బాధిత పోలీసు కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సానుభూతి ప్రకటించారు. వారి ప్రాణత్యాగాలు వృథా పోవని అన్నారు. కాగా, రాష్ట్రంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తులు చనిపోయారని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు.


Next Story

Most Viewed