ఈ బడ్జెట్ కొంచెం మోదం.. కొంచెం ఖేదం

by Ravi |
ఈ బడ్జెట్ కొంచెం మోదం.. కొంచెం ఖేదం
X

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బడ్జెట్‌పై సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కార్మిక, కర్షక అనుకూల విధానాలు ఉంటాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అభివృద్ధి ఉరకలేస్తుందని ప్రజలంతా భావించారు. అయితే, వేతన జీవులకు మాత్రం నిరాశే మిగిలింది.

కేంద్రం నవ ప్రాధాన్యాలు నిర్ణయించుకుని వాటిని సాధించడం ద్వారా వికసిత్‌ భారత్ సాధిస్తామని ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి సాధించి వికసిత్ భారత్‌గా మారడానికి ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్ వేసిందని చెప్పవచ్చు. రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించే లాగా బడ్జెట్ ఉంది. మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం చాలా ఉపయోగకరం.

తెలంగాణకు నిర్లక్ష్యమే!

దేశవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ రాజకీయ అవ సరాలను దృష్టిలో పెట్టుకొని మోడీ 3.0 ప్రభుత్వానికి కావలసిన పూర్తిస్థాయి మద్దతిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈ సారి పక్షపాతంతో నిధులు కేటాయించినట్టుగా ఈ బడ్జెట్‌ను చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో లాగే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో నిర్లక్ష్యం ఎదురైంది.

వ్యవసాయానికి పెద్దపీట...

దశాబ్ద కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించింది. నూతన వంగడాల ప్రోత్సాహం, వ్యవసాయ రంగంలో పరిశోధనారంగాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం కనీస మద్దతు ధరకు ప్రాధాన్యత నివ్వడం హర్షణీయం. మద్దతు ధర విషయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వారికి ఇచ్చే మద్దతు ధర సామాన్య మద్దతు ధర ఒకే రకంగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలలో అంతర్గతంగా పరిశీలిస్తే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే దిశగా ప్రతిపాదనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేశంలో ఇప్పటికీ దాదాపు 60 శాతం ప్రజలు వ్యవసాయ వ్యవసాయ రంగం అనుబంధ విభాగాలపై ఆధారపడుతున్నారు. ఈ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగ వుతాయి. అలాగే ఈ బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధి, రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వేతన జీవులకు తీవ్ర నిరాశ

ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను పరిమితి పెంపు కోరుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉన్నందున వేతన జీవుల ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండాలని కోరుకున్నారు. ఆదాయ పరిమితులు పెంచాలని ఈ కొత్త పాత ఆదాయ పన్నుల్లో ఉన్న రాయితీలపై తికమక పెట్టకుండా రెండింటిని కలిపి ఆదాయపన్ను పరిమితిని కనీసం ఐదు లక్షలకు పెంచుతుందని ఆశించారు. ప్రస్తుతం ఉన్న పన్ను చెల్లింపుదారులను కొత్త ఆదాయపరిమితిలోకి తీసుకువచ్చే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం టాక్స్ రిలీఫ్‌ను ఇవ్వలేదని మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల సామాన్య మధ్యతరగతి వేతన జీవులు తీవ్ర మీద నిరాశకు లోనయ్యారు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ బడ్జెట్ కొంత ఊరట కలిగింది.

విద్యారంగానికి నిధులు ఇంతేనా?

బడ్జెట్లో 30% విద్య, నైపుణ్య అభివృద్ధి కోసం నిధులు కేటా యిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కోటి మంది యువతకి ఇంటర్న్‌షిప్ ద్వారా నైపుణ్య అభివృద్ధి చేస్తామని టార్గెట్ నిర్ణయించుకుంది. కానీ భారతదేశంలో స్కూల్ స్థాయిలో డ్రాప్ అవుట్ రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. బిహార్ 20.5%, ఒరిస్సా 27.3%, తెలంగాణ 13.7%, ఆంధ్రప్రదేశ్ 16.3%, అస్సాం 20.3%, గుజరాత్ 17.9% ఉండగా.. తక్కువ డ్రాపౌట్స్ ఢిల్లీ 4.8%, తమిళనాడు 4.5%, కేరళ 5.5%, హిమాచల్ ప్రదేశ్ 1.5 %, ఉత్తరాఖండ్ 5% ఆందోళన కలిగిస్తున్నాయి. యువతలో నైపుణ్యం పెంపు కోసం ఈ బడ్జెట్‌లో నైనా ఐఐటీలో ఎన్ఐటీలు ఏర్పాటు చేస్తారని ఆశించారు కానీ నిరాశ మిగిలింది. ప్రభుత్వ విద్యా రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన నాణ్య మైన విద్య అందించడం కోసం మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఈ బడ్జెట్లో కేవలం 3.25 శాతం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యారంగం నిర్లక్ష్యానికి గురైనట్లుగా మనకు అవగతం అవుతుంది.

ప్రపంచ స్థాయి శిక్షణా సంస్థలు

ఆర్థిక సర్వే ఆధారంగా భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 30% నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగిత ప్రధాన సమస్యగా ఉంది. దీనికోసం ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూ ఉపాధి మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా మనకు అర్థం అవుతుంది. యువతలో నైపుణ్యాలు పెంచడం కోసం ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. భారతీయ యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా విద్య, ఉపాధి నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రక టించడం సంతోషదాయకం.

నూతన పెన్షన్ స్కీంపై ఒక విధానపరమైన నిర్ణయం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిం చాయి. కానీ దానిపై ఏ నిర్ణయం లేకుండా దాటేసే ధోరణి ప్రదర్శించింది. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించి నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడితే భారతదేశం ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలుస్తుంది. ఆ దిశగా చర్యలు చేపడతారని ఆశిద్దాం. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంలను అధిగమించి సామాన్య ప్రజల సంక్షే మానికై పాటుపడితే తప్పకుండా మనదేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ కొంచెం మోదం కొంచెం ఖేదంలా రూపొందింది.

Read more...

జనరంజకమైన బడ్జెట్!

-పాకాల శంకర్ గౌడ్

98483 77734



Next Story