పసిపిల్లలపై లైంగిక దాడులా..?

by Ravi |   ( Updated:2024-07-17 01:00:18.0  )
పసిపిల్లలపై లైంగిక దాడులా..?
X

నిద్రపోదామంటే నిద్ర రావటం లేదు...అన్నం తినాలంటే తినబుద్ది అయితలేదు.. అనుక్షణం పాపనే గుర్తుకు వస్తుంది.. బాగుండేది.. కళ్లముందల ఆడుకుంటూ ఉండేది.. నాన్న.. నాన్న అనే పిలుపు వినిపిస్తుందని ఆ తండ్రి పడే ఆవేదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పొద్దున లేస్తే మహాల మిలా ఇంటి ముందు ఆడుకుంటూ సందడి సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది..

3వ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల ఆ చిన్నారి ముగ్గురు మైనర్ల కామానికి బలైపోయింది. ఈ సంఘటనతో ప్రతీ ఒక్క తల్లిదం డ్రులు తమ పిల్లలను బడికి పంపాలన్నా, ఒంటరిగా బయట ఆడుకోనివ్వాలన్నా, కిరాణా షాపులకు పంపాలన్నా వణికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మన సంప్రదాయాలు నేర్పకపోతే..

ఈ దారుణ ఘటన గురించి రాయాలంటేనే పెన్ను ముందుకు కదలడం లేదు.. అంతలా ప్రభావితం చేసింది.. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల పాపను 12 సంవత్సరాలలోపు మైనర్లు రేప్ చేసి చంపి కాలువలో పడేశాం.. స్మశానంలో పాతేశాం... కాదు కాదు బావిలో పడేశాం అంటూ పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాపిస్తూ.. పోలీసులకే సవాల్ విసిరారు ఆ మైనర్లు. అసలు ఈ వయసులో వాళ్లకు ఆ ఆలోచనలు ఎలా వస్తాయి? ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డారో అర్థం కావడం లేదు. అసలు తల్లిదండ్రులు... ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు.. నైతిక విలువల పట్ల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించడం లేదా అనే అనుమానం వస్తుంది. వీరు పట్టింపులు, బాధ్యతలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు నేర్పించకపోతే మనిషిలో ఉన్న మృగం లేస్తుంది. ఇలాంటి మృగాళ్లను కట్టడి చేయకపోతే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది.

ముక్కు పచ్చలారని శిశువులపై...

వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లపై అమానుష అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురవుతూనే ఉంది. ముక్కు పచ్చలారని శిశువులపై సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మగాళ్లు మృగాళ్లలా మారి స్త్రీల జీవితాలను అంధకారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వావి.. వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రి కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలను అమల్లోకి తెస్తున్నా, వారికి రక్షణ లేకుండా పోయింది.

మంచి, చెడు స్పర్శ తెలీని పిల్లలు..

చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు ఎరచూపించి కామాంధులు శరీరభాగాలను తాకుతున్నారు. కౌమార దశలోని బాలికలకు మంచి, చెడూ స్పర్శలను తల్లిదండ్రులు చెప్పడం లేదు. కామాంధులు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్‌ ఫోన్‌లో గేమ్‌లు ఆడండి అంటూ పిలిచి గదుల్లోకి తీసుకెళ్లి లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పిల్లలకు అశ్లీల వీడియోలు, అసభ్య ఫోటోలు చూపించి బలాత్కారం చేస్తున్నా రు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. అంతా తెలిసినా కొంతమం ది తల్లిదండ్రులు పరువు పోతుందేమోనని బయపడి పోలీసులకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది ఆసరా తీసుకు న్న మృగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.

పిల్లలను బడికి పంపడమెలా?

ప్రస్తుత సమాజంలో యువత, విద్యార్థులు, చిన్న పిల్లలు బానిసలుగా మారి గంటలకొద్దీ అదేపనిగా సెల్‌పోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ‌తరగతులను వీక్షించే పేరిట గంటల తరబడి సెల్‌ ‌ఫోన్‌‌‌తో కాలక్షేపం చేస్తూ అశ్లీల దృశ్యాలు చూస్తూ చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. సెక్స్, హింస, మాదకద్రవ్యాల దుర్వినియోగం, అభ్యంతరకరమైన భాషతో కూడిన సినిమాలు చూడటం పిల్లలకు యుక్తవయస్సులోనే ప్రతికూల ప్రభావం కలుగుతోంది. తమ హీరో బార్‌లో కూర్చొని మందు కొడుతూ సిగరెట్ తాగుతూ నవ్వుతూ ఉన్నాడు కాబట్టి ఇలా చేయాలని అనిపిస్తుంది. హీరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంట పడటం.. ఆమె వెనకాల పడటం.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని చూపటం చాలా సినిమాల్లో చూపిస్తారు.. చదువుపై దృష్టి పెట్టకుండా చిన్న వయసులోనే ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నారంటే తప్పకుండా సినిమా, మొబైల్ ఫోన్ల వాడకమే కారణం. చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్న తరుణం లో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడమెలా అని ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాలకులు వాటిని అరికట్టడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.

- చందు

జర్నలిస్టు

94406 88986

Advertisement

Next Story

Most Viewed