విద్యావంత మహిళలూ…రాజకీయాల్లోకి రావాల్సిన సమయమిదే!

by Ravi |
విద్యావంత మహిళలూ…రాజకీయాల్లోకి రావాల్సిన సమయమిదే!
X

ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునీకరించబడుతోంది. విద్య, వైద్య, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు మున్ముందుకు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. ప్రతి కుటుంబంలోనూ స్త్రీలు తమ జ్ఞానాన్ని సాధికారికతను ప్రదర్శిస్తూ సమాజ పురోగతిని శాసిస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు ఇంజనీర్లు చంద్రయాన్-3 మిషన్‌లో కీలకంగా తమ సేవల్ని అందించారు. రీతు కరిథల్, భారతదేశపు రాకెట్ మహిళగా ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణచివేత, వీరిని నిలువరించలేక పోతున్నాయి.

అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించడానికి వివక్షకు వ్యతిరేకంగా వారు యుద్ధం చేస్తూనే కొనసాగుతున్నారు. గత రెండేళ్లలో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలో స్త్రీలకు ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 భట్నాగర్ బహుమతుల్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్రవేత్తలకు మాత్రం అవార్డు లభించింది. మహిళలు కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకు కోల్పోయిన కెరీర్ సంవత్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా ‘అకడమిక్’ వయస్సును పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

నోబెల్ అవార్డుల్లోను వివక్షే...!

నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో నేచర్‌లో ఒక వ్యాసం ప్రచురించబడింది.ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలకు అందుబాటులోని వనర్లు తక్కువగా వుండటం, అందువల్ల వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటున్నాయి. అధ్యాపక రంగాల్లో వున్న మహిళలు పురుషులతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదకతపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్‌కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందిన వారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది.

మానవ నాగరికతను మనం పరిశీలించినపుడు ప్రతి కీలకమైన పరిణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. భారతదేశం బ్రిటీష్ వారి అణచివేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. గృహహింస, అణచివేతను ఎదుర్కోవలసి వచ్చిన సందర్భాల్లో పదునుదేలుతూనే వున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి చర్చించుకున్నపుడు కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్న మాణిక్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ మానేపల్లి సరళాదేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొదలుగు మహిళా మణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని కదనరంగంలో ముందుండి నడిపారు. పోరాటాలు భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించాల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది.

మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకం

ఈనాడు భారతదేశంలో స్త్రీ సాధికారికత పై విస్తృత చర్చ ఊపందుకుంది. డా. బి.ఆర్.అంబేడ్కర్ 1949లో ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకపోవడానికి కారణం అప్పటి భారత సమాజంలో చిట్టెంగట్టుకుపోయిన అసమానలు. స్త్రీ ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛ ఆనాడు ఎవరికీ కొరుకుడు పడలేదు. నూతన పార్లమెంటు భవనంలో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్టసభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్‌సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లోనే అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్‌సభలో ప్రవేశించారు. 12.7% ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండాక కూడా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపుమాపడానికి సామాజిక, సాంస్కృతిక ఆర్థిక అసమానతలనూ రూపుమాపవల్సి వుంది అని గుర్తించాలి.

ప్రముఖంగా రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు మనముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజకీయ సమానత్వం సాధ్యమేనా? లేదా క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? అనేక సందర్బాల్లో డిబేట్స్‌లో కానీ, సోషల్ మీడియాలో గానీ రాజకీయ నాయక మణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ చేయబడుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమనిస్తున్నాము. ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీలకతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందాలి. సమస్యలపై పోరాటం జరగాలి అని ప్రజలు ఆశిస్తున్నారు. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారా లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. నేటి స్త్రీలకు రాజకీయ ప్రాతినిధ్యం గురించి ఆలోచన జరుగుతున్న తరుణంలో నూతన బిల్లులో బిసి, మైనార్టీ, స్త్రీలకు లభించనున్న ప్రాతినిధ్యంపై స్పష్టత కొరవడింది.

ఓటు హక్కుపై చిన్నచూపు వద్దు

స్త్రీ సాధికారికతని వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి దిశానిర్ధేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికులతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సాహంగా భాగస్వాములు కావల్సి వుంది. ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ప్రేమ పేరుతో యువతులపై కొనసాగిస్తున్న హింసకు చరమగీతం పాడాలి. హత్యలు, సామూహిక అత్యాచారాలు కలిగిస్తున్న మానసిక ఒత్తిళ్ళు తాళలేక ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు నెట్టబడుతున్నారు. ఎందరో అబలలు అభద్రత నుండి యువతులను మరింత సమర్థవంతంగా ప్రభుత్వాలతో కలిసి సామాజిక బాధ్యతగా రక్షించుకోవాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. సాధికారికతకు విద్యతోపాటు ఆర్థిక స్వావలంబన, స్త్రీల ఉత్పాదకత పెరగాలి. వీరి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సివుంది.

పరిమితమైన రాజకీయ ప్రాతినిధ్యం

డా.బి.ఆర్.అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమితమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభలో 543 సీట్లు మరియు రాష్ట్రాల శాసనసభల్లో మొత్తం సీట్లలో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారధ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగతి నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభలో 543 సీట్లలో 180 సీట్లు, రాష్ట్రాల శాసన సభల్లో మొత్తం సీట్లలో 33% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. ఎస్‌సి, ఎస్‌టి స్త్రీలకు వారి కోటా ఆధారంగా ప్రాధాన్యత నిర్ణయించబడుతుంది. బి.సి., మైనార్టీ, స్త్రీల విషయంలో స్పష్టత కొరవడింది.

ఈనాడు రాజకీయ రంగంలోనూ స్త్రీ ఒంటరి పోరాటం చేస్తుంది. ఇది ఔత్సాహిక మహిళలలో నిరుత్సాహం కలిగిస్తుంది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలోకి కదం తొక్కే అవకాశం వుంటుంది. ఏ రాజకీయ సమస్య అయినా పరస్పర దూషణ ద్వారా రెండు పక్షాల మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీలకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. నేటి సమాజానికి మాతృస్వామిక భూమికపై నిర్మించాలి. నిజాయితీ పరులైన స్త్రీలు భారతదేశాన్ని ముందుండి దిశా నిర్దేశం చేయాలి. వారి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. చట్టాల్ని రూపొందించే ప్రక్రియ లో భాగస్వామ్యం అసమానతల్ని రూపుమాపడానికి సమిష్టి కార్యాచరణకు పునాది. ఈ దిశగా సమానత్వం పునాదిగా గలిగిన సమాజాన్ని నిర్మిద్దాం.

డా. కత్తి సృజన

అసిస్టెంట్ ప్రొఫెసర్

పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ

99487 48812



Next Story