ఢిల్లీ.. కొత్త హాట్‌స్పాట్!

by vinod kumar |
ఢిల్లీ.. కొత్త హాట్‌స్పాట్!
X

దిశ, సెంట్రల్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నగరాల్లోనే నమోదవుతున్నాయి. అత్యధిక కేసులున్న రాష్ట్ర రాజధాని నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, చెన్నైలలో భారీగా నమోదవుతున్నాయి. ముంబయిలో నిన్నా మొన్నటి వరకు 1,200ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నగరాన్నే కరోనా హాట్‌స్పాట్‌గా భావించారు. కానీ, ఇప్పుడు ముంబయికి ధీటుగా ఢిల్లీ దూసుకొస్తున్నది. రోజువారీగా అత్యధిక కేసులు నమోదు చేస్తూ కొత్త హాట్‌స్పాట్‌గా అవతరిస్తున్నది. బుధవారం కొత్త కేసుల్లో ఢిల్లీ, ముంబయిని దాటేసింది. ఆ రోజు ఢిల్లీలో 1,513 కొత్త కేసులు రిపోర్ట్‌ కాగా, ముంబయిలో 1,276 కేసులు నమోదయ్యాయి. గతవారానికి ముందు వరకు ఢిల్లీలో రోజుకు 500 నుంచి 800 మధ్యలో కొత్త కేసులు వెలుగుచూసేవి. వారం రోజులుగా వెయ్యి చొప్పున కేసులు వస్తున్నాయి. కానీ, ఆ సంఖ్య బుధవారం ఒక్కసారిగా 1,513కు చేరింది. అదే రోజు ముంబయిలో 1,275 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. ముంబయి కన్నా ఎక్కువగా ఢిల్లీలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్యతో పోల్చితే ముంబయి కంటే ఢిల్లీలో కేసులు స్వల్పమే. కానీ, కొత్త కేసులు పెరుగుతూ వస్తుండటమే ఢిల్లీని మరో హాట్‌స్పాట్‌గా మారనుందన్న వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నది. గురువారం నాటికి ఢిల్లీలో మొత్తం కేసులు 23,645 ఉండగా.. మరణాలు 606గా రికార్డు అయ్యాయి.

15 రోజుల్లోనే కట్టడి జోన్‌లు 73 నుంచి 158కి

ఢిల్లీలో కేసులు వేగంగా పెరుగుతుండటంతో కంటైన్‌మెంట్ జోన్లూ పెరుగుతున్నాయి. 15 రోజుల్లోనే ఈ నగరంలో కంటైన్‌మెంట్ జోన్లు దాదాపు రెట్టింపయ్యాయి. గతనెల 18న ఢిల్లీలో 73 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా.. నేడు అవి 158కి పెరిగాయి. ఈశాన్య, ఉత్తర ఢిల్లీలో అత్యధిక (31చొప్పున) కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల, ఇతర ఉద్యోగులందరూ చాలా వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో నివసిస్తుంటారు. లాక్‌డౌన్ సడలింపులతో ఈ అర్బన్ సెంటర్‌ల నుంచి చాలా మంది రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఢిల్లీ ప్రభుత్వం సరిహద్దుల్లో నుంచి రాకపోకలపై వారంపాటు నిషేధం విధించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుర్గావ్, నోయిడాలాంటి నగరాల నుంచి ప్రయాణాలను అడ్డుకునేందుకు నిర్ణంయించింది.

నగరాల్లో విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు చాలా వరకూ నగరాల్లోనే నమోదయ్యాయి. మనదేశంలోనూ అదే తీరు ఉన్నది. ముఖ్యంగా మూడు నగరాలు ముంబయి, ఢిల్లీ, చెన్నైల్లోనే దేశంలోని మొత్తం కేసుల్లో 40శాతానికి పైగా నమోదయ్యాయి. గురువారం నాటికి దేశంలోని మొత్తం కేసులు 2.16 లక్షలకు చేరాయి. కాగా, ఇందులో ఈ మూడు నగరాల్లోని కేసులే 87వేలు ఉండటం గమనార్హం. ముంబయిలో 44,931, ఢిల్లీలో 23,645, చెన్నైలో 18,693 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed