మద్యం మత్తులో నానమ్మపై దాడి...అక్కడికక్కడే మృతి

by Sridhar Babu |
మద్యం మత్తులో నానమ్మపై దాడి...అక్కడికక్కడే మృతి
X

దిశ,మేడ్చల్ టౌన్ : మద్యం మత్తులో నానమ్మను గోడకేసి కొట్టడంతో తీవ్ర గాయాలై వృద్దురాలు మృతి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలో నివాసముండే బందెల బాలమ్మ (62)కు మధు అనే కుమారుడు ఉన్నాడు. మధుకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. రావల్ కోల్ గ్రామ పరిధిలో బాలమ్మ పేరుపై ఉన్న భూమిని గత సంవత్సరం క్రితం అమ్మేశారు. పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. మరొక కుమార్తె వివాహం కోసం డబ్బులను ఫిక్స్డ్​ డిపాజిట్ చేశారు. ఇదే క్రమంలో బాలమ్మ మనువడు ప్రశాంత్ తనకు కూడా డబ్బులు ఇవ్వాలని, బైక్ కొనివ్వాలని ఎప్పుడూ బాలమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు.

ఇదే క్రమంలో శుక్రవారం ప్రశాంత్ సోదరీమణులు ఇంటికి వచ్చారు. ప్రతిరోజూ నానమ్మను డబ్బుల కోసం వేధించడం సరైనది కాదని వారు ప్రశాంత్ కు హితబోధ చేసి వెళ్లిపోయారు. కానీ వారు వెళ్లిన తర్వాత ప్రశాంత్ రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంట్లోకి వచ్చి వృద్ధురాలి తలను పట్టుకొని గోడకేసి కొట్టాడు. దీంతో గాయాలైన బాలమ్మ ముక్కు, చెవి నుంచి రక్తం కారింది. అది గమనించిన ప్రశాంత్ తన తల్లి వద్దకు వెళ్లి నానమ్మకు రక్తం కారుతుంది అని తెలియజేశాడు. బాలమ్మ దగ్గరికి వెళ్లి పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రశాంత్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలమ్మ కూతురు దుండిగళ్ల ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed