ఫారెస్ట్ ఉద్యోగాల్లో వీరు చేరడం హర్షణీయం

by Shyam |
Forest Academy Doolapally
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యార్హతలు కలిగినవారు అటవీ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో పాటు, అటవీ రక్షణ విధుల్లో పాల్గొనటం హర్షనీయమని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో గురువారం నిర్వహించిన 29వ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 38 మంది ఫారెస్ట్ బీట్ అధికారుల ఆరు నెలల శిక్షణ ముగియగా ఇందులో 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 25 మంది గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు టీఎస్ పీఎస్సీ ద్వారా ఎంపికయ్యారని తెలిపారు. పీసీసీఎఫ్ శోభ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అటవీ రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, శిక్షణ పూర్తి చేసిన బీట్ అధికారులు విధి నిర్వహణలో అకింతభావంతో పనిచేయాలని సూచించారు.

అటవీ సంబంధిత విషయాలతో పాటు వీరికి వెపన్ ట్రైనింగ్, సర్వే ట్రైనింగ్, జీపు నడపడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ తెలిపారు. శిక్షణలో భాగంగా పలు రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిని ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రతీ ఏటా విధి నిర్వహణలో ఉత్తమంగా పనిచేసిన అటవీ అధికారికి ఇచ్చే కేవీఎస్ బాబు సంస్మరణ అవార్డును ఈ ఏడాది కొత్తగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాళోజీ జయంతిని అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ ఆర్ఎం డోబ్రియల్, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి రాజా రావు, ఫారెస్ట్ అకాడమీ సంచాలకులు బుచ్చిరాంరెడ్డి, సంగీత, కోర్స్ డైరెక్టర్, శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed