BIG BREAKING NEWS: 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు.. నోటిఫికేషన్ రిలీజ్!

by Geesa Chandu |
BIG BREAKING NEWS: 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు.. నోటిఫికేషన్ రిలీజ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి లలో 1284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులను సర్కార్ భర్తీ చేయనున్నది. ఈ మేరకు బుధవారం బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 21 నుంచి అక్టోబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. నవంబరు 10 న కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (Computer Based Test) నిర్వహించనున్నారు. అభ్యర్ధులకు ఏవైనా అభ్యంతరాలు, తప్పిదాలు ఉంటే అక్టోబరు 5 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. వచ్చిన అప్లికేషన్లను బట్టి పరీక్షల సెషన్స్ ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

అయితే, ఇంగ్లీష్​ మీడియంలో మాత్రమే పరీక్ష ఉండనున్నది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్లకు వెయిటేజ్ మార్కులు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. తెలంగాణ పారామెడికల్ బోర్డులో తమ విద్యార్హత ధ్రువ పత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు ఇచ్చారు. ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(ఆర్టీసీ, మునిసిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల వయోపరిమితిని సడలింపునిచ్చారు. పోస్టుల్లో 95 స్థానికులకేనని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులని పేర్కొన్నారు. ఒకవేళ ఒకటి నుంచి ఏడు వరకు ఇక్కడ చదవకుంటే, తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధ్రువ పత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. వంద పాయింట్ల ప్రాతిపదికన ఎంపిక జరగుతుండగా, 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మిగిలినవి వెయిటేజ్ కింద ఎంపిక చేస్తారు. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత గూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట పట్టణ కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story