వారాంతం కొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం కొత్త రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు కొంత విరామం తర్వాత తిరిగి రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అంతకుముందు సెషన్‌లలో కొంత బలహీనపడిన సూచీలు వారాంతం పుంజుకున్నాయి. ప్రధానంగా జూన్ త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలవడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది, అందుకు తగినట్టుగానే దిగ్గజ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు మించి ప్రకటించడంతో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ఉత్సాహం చూపించారు. తద్వారా ఐటీ రంగంలోని షేర్లలోనూ జోరు పెరిగింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 80,893 వద్ద, నిఫ్టీ 24,592 వద్ద కొత్త గరిష్ఠాలను తాకాయి. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు శుక్రవారం ర్యాలీకి దోహదపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగసి 80,519 వద్ద, నిఫ్టీ 186.20 పాయింట్లు బలపడి 24,502 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం ఏకంగా 4.53 శాతంతో రాణించగా, మీడియా రంగం స్వల్పంగా పెరిగింది. మిగిలిన రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.52 వద్ద ఉంది. కాగా, టీసీఎస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో రూ. 12,040 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఇది గతేడది కంటే 8.7 శాతం అధికం. ఆదాయం కూడా రూ. 62,613 కోట్లతో 5.4 వృద్ధిని వెల్లడించింది.

Advertisement

Next Story