వరుసగా నాలుగో రోజు నష్టాల్లో సూచీలు

by Dishanational1 |
వరుసగా నాలుగో రోజు నష్టాల్లో సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఒకరోజు సెలవు తర్వాత గురువారం ప్రారంభమైన ట్రేడింగ్‌లో ప్రధానంగా బ్యాంకింగ్ రంగ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు దెబ్బతిన్నాయి. ఉదయం సానుకూలంగానే ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తర్వాత చివరి గంట వరకు స్థిరంగా ర్యాలీ చేశాయి. అమెరికాలో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి తగ్గింపు ఇప్పట్లో ఉండదనే సంకేతాలు, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కారణంగా మార్కెట్లు ప్రభావితం అవుతున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.69 పాయింట్లు నష్టపోయి 72,488 వద్ద, నిఫ్టీ 152.05 పాయింట్ల నష్టంతో 21,599 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా రంగం మినహా అన్ని రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలనవన్నీ బలహీనపడ్డాయి. ముఖ్యంగా నెస్లె ఇండియా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది.

Next Story

Most Viewed