టీఎన్‌సీఏ అధ్యక్షురాలు రూపా గురునాథ్‌ను దోషిగా తేల్చిన బీసీసీఐ

by Shyam |
టీఎన్‌సీఏ అధ్యక్షురాలు రూపా గురునాథ్‌ను దోషిగా తేల్చిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూతురు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు రూపా గురునాథ్ ను ‘పరస్పర విరుద్ద ప్రయోజనాలు’ అంశం కింద దోషిగా తేలినట్లు బీసీసీఐ ఎథిక్స్ అధికారి, రిటైర్డ్ జస్టీస్ డీకే జైన్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్త ఫిర్యాదు మేరకు రూపా గురునాథ్‌ అంశంపై ఎథిక్స్ అధికారి విచారణ జరిపారు. ఇండియాలోనే ఒక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు తొలి మహిళా చీఫ్‌గా ఎన్నికైన రూపా గురునాథ్.. అప్పటికే ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్)లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మాతృ సంస్థ ఐసీఎల్ కావడం గమనార్హం. ఒకవైపు ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో ఉంటూ.. అదే సమయంలో బీసీసీఐ అనుబంధ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా ఉండటం తప్పకుండా ‘పరస్పర విరుద్ద ప్రయోజనాలు’ అంశం కిందకే వస్తుందని జస్టీస్ డీకే జైన్ స్పష్టం చేశారు. అయితే ఐసీఎల్‌కు సీఎస్కే జట్టుకు సంబంధమే లేదని డిఫెన్స్ వాదించింది. కానీ డీకే జైన్ మాత్రం తన ఏడు పేజీల తుది ఆర్డర్‌లో రూపా గురునాథ్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.

‘మా పరిశీలనలో వచ్చిన అంశాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇండియా సిమెంట్స్ గ్రూప్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించాము. సీఎస్కే యాజమాన్యం, పరిపాలనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐసీఎల్ బోర్డుకు సంబంధం ఉన్నది. డిఫెన్స్ మాత్రం ఐసీఎల్, సీఎస్కేకు సంబంధమే లేదని వాదించినా.. వారి వాదనతో మేము ఏకీభవించడం లేదు’ అని డీకే జైన్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో రూపా గురునాథ్ తనకు ఉన్న రెండు పదవుల్లో ఒక దానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, సీఎస్కే దీనిపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నది.

Next Story

Most Viewed