AP CM YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు మరో లేఖ..

by srinivas |   ( Updated:2021-10-16 08:56:12.0  )
AP CM YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు మరో లేఖ..
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. ఇటీవల జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పర్యటనపై తమ అసంతృప్తిని ఎమ్మెల్యేలు లేఖలో వెళ్లగక్కారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ..‘ మా జిల్లాకు మీ రాక, మా ప్రజలందరికీ సంతోషం కన్నా..ఎక్కువ విచారాన్ని మిగిల్చింది. మా జిల్లా ప్రగతి, సమస్యలపై మీరు ఏ మాత్రం శ్రద్ద వహించడం లేదని రుజువయ్యింది. మేము ముందు మీకు రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారు.. మా ఆవేదనని అర్ధం చేసుకోలేదు. ప్రజా సంక్షేమం, సమస్యలు, జిల్లాలో తీవ్ర సంక్షోభాన్ని చూడలేదు. మేము లేవనెత్తిన సమస్యల్లో ఏ ఒక్కదానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదు, సమాధానం చెప్పలేదు. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. అందుకే మా ఆవేదనను మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

వెలుగొండకు అన్యాయం చేయోద్దు

ప్రకాశం జిల్లాలోని సమస్యలను ప్రస్తావిస్తూ లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరి ప్రయోజనాల కోసమో మా “వెలుగొండ”కి అన్యాయం చేస్తున్నారు. గెజిట్‌లో వెలిగొండను అనుమతి పొందిన ప్రాజెక్ట్‌గా చేయడం కోసం కేంద్రాన్ని ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం, యూనివర్సిటీ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది. రామాయపట్నం పోర్టుని ఎందుకు దారి మళ్లిస్తున్నారని’ లేఖలో నిలదీశారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్తు బిల్లులు అన్నిటినీ పెంచేసి ఏ మొహంతో మీరింకా సంక్షేమం అంటున్నారు. నిరుద్యోగ భృతి తీసేశారు.. కనీసం ఒక్క ప్రాజెక్టు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేని మీరు “ఉద్యోగాలు, ఉపాధి” అంటూ ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు. ఎవరికో, ఎక్కడో ప్రయోజనం చేకూర్చడం కోసం వెలుగొండ ప్రాజెక్టుకు అన్యాయం చేయోద్దని ప్రకాశంలోని ప్రతి రైతు గుండె గర్జిస్తోంది’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ‘మా జిల్లా రైతులు, ప్రజల తరఫున వెలుగొండకు అన్యాయం చేయోద్దు అని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. ‘సభలో ఏదో రాజకీయ విమర్శలు చేశారు.. కాకి లెక్కలతో గత టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లారు. రాజకీయం తప్ప పరిపాలన చేతకాని మీ నుండి ఇంతకంటే ఏం ఆశించగలం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

గ్రానైట్ పరిశ్రమని బతికించండి..

వైఎస్ఆర్ ఆసరా అంటూ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఏదైనా ఒక శాశ్వత ప్రాజెక్టు ఇస్తారేమో..ఒక పరిశ్రమ ప్రకటిస్తారేమోనని నమ్మకంతో ఎదురు చూశాం. కానీ మీరు వచ్చారు, వెళ్లారు. ఆసరా పేరిట కల్లబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేసి వెళ్లిపోయారు. ఆసరాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 12 లక్షల మందిని కట్ చేశారు. జిల్లాలోని మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ మా జిల్లాకు ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతున్నారు, మా జిల్లాలో ఇది అత్యవసరం అని అడగలేకపోయారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాకాంక్ష, ప్రజాభీష్టం, ప్రజాభిప్రాయం మేరకు మరోసారి అడుగుతున్నాం. వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్‌లో చేర్చేలా కేంద్రంతో మాట్లాడండి. జిల్లాకు ఒక పరిశ్రమని ప్రకటించండి. రామాయపట్నం పోర్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమని బతికించండి. సుబాబుల్, జామాయిల్ రైతులకు మద్దతు ధర దక్కేలా చూడండి. నిత్యావసరాల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోండి. రైతులకు సకాలంలో సాగునీరు, ఎరువులు అందేలా బాధ్యత వహించండి. గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టును ప్రారంభించండి. పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయండి. రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను ఆధునీకరించి ఆయకట్టు పెంచేలా చర్యలు చేపట్టండి. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే మోటర్లకు మీటర్లను మా రాష్టంలో ఏర్పాటు చేయమని కేంద్రానికి చెప్పండి. ప్రకాశం రైతులకు, ప్రజలకు అండగా నిలవండి’ అంటూ లేఖలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు కోరారు.

Advertisement

Next Story

Most Viewed