Ap News : ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తాం.. రాసిపెట్టుకోండి!

by srinivas |
Ap News : ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తాం.. రాసిపెట్టుకోండి!
X

దిశ,కడప: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, దేశంలోనూ, రాష్ట్రంలోనూ సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ పూసే లేదని గుర్తు చేశారు. చెన్నూరు చక్కర కర్మాగారం తెరిపిస్తారన్నారని, ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తామని చెప్పారు కానీ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం సొంత జిల్లాలో, రాష్ట్రంలో హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని గిడుగు రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేవారు. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప అధికార పార్టీ తొత్తులుగా పని చేయకూడదని సూచించారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి రాష్ట్రంలో కుంట పడిందన్నారు. వెనుకబడ్డ రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎంపీ స్థానాలు వైసీపీకి ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయాడో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పెద్దల వద్ద తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చేస్తుందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మీటింగ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డిను అమిత్ షా అవినీతిపరుడు అని మాట్లాడం విడ్డూరమని విమర్శించారు. జగన్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని సెటైర్లు వేశారు. వీరిలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుందన్నారు. సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఘాటుగా చెప్పారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పారు. ప్రధాని అవ్వంగానే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక హోదాపై చేస్తారని గిడుగు రుద్రరాజు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed