ఆప‌ద కాలం...ఆప‌న్న హ‌స్తం అందించండి: టీడీపీ కేడర్‌కు నారా లోకేశ్ సూచన

by Seetharam |
ఆప‌ద కాలం...ఆప‌న్న హ‌స్తం అందించండి: టీడీపీ కేడర్‌కు నారా లోకేశ్ సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుఫాన్ న‌ష్టం అపారంగా ఉంద‌ని, ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి తెలుగుదేశం శ్రేణులు అండ‌గా నిల‌వాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ తీవ్ర‌త‌పై వారం రోజులు ముందుగానే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తుపాన్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌నీసం స‌మీక్షించ‌క‌పోవ‌డం దారుణమని అన్నారు. తుఫాన్ పై అప్ర‌మ‌త్తం చేయ‌డంలోనూ... స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలోనూ ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంతో ప్ర‌జ‌లు త‌మ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వ‌ర‌ద ప్రాంతాల్లో గ‌డుపుతున్నార‌ని లోకేశ్ ప్రకటనలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఏ విప‌త్తు వ‌చ్చినా, టీడీపీ అధికారంలో ఉన్నా....లేకున్నా మాన‌వ‌తాదృక్ప‌థంలో స‌హాయం చేసే తెలుగుదేశం శ్రేణులు తుఫాన్ స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌లో పాల్గొనాల‌ని లోకేశ్ పిలుపునిచ్చారు. ఓ వైపు వ‌ర్షం-మ‌రోవైపు తీవ్ర‌మైన గాలులు ఉన్న నేప‌థ్యంలో అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుని వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం, ఇత‌ర‌త్రా సాయం అందించాల‌ని టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ సూచించారు.

Advertisement

Next Story