Scam of special exams in AU: ఏయూలో స్పెషల్ పరీక్షల స్కాం

by Indraja |
Scam of special exams in AU: ఏయూలో స్పెషల్ పరీక్షల స్కాం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని అంధకారంలోకి నెట్టిన వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లు అయిన వారికోసం ప్రత్యేక పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి రూ,కోట్లు గడించారనే ఆరోపణలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. స్పెషల్' పరీక్షల పేరుతో గత 5 సంవత్సరాలుగా మంత్రులు, వైసీపీ నాయకులలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, వారి బంధువులకు ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమంగా వందల సంఖ్యలో డిగ్రీ, పీజీ పట్టాలు మంజూరయ్యాయి.

వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి, పాత రిజిస్ట్రార్‌లు వడ్డాది కృష్ణమోహన్, ప్రస్తుత రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లు అడ్డగోలుగా మార్కులు వేసి, ఫస్ట్ క్లాసులలో పాస్ చేయించిన, అక్రమాలు బయటకు వస్తున్నాయి.

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ఇలాగే పీజీ ..

సీబీసీఐడీ చీఫ్‌గా సంజయ్ వైసీపీ పాలనలో ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ కేసులో అరెస్టు చేయడంతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన వైసీపీ పెద్దల సూచనల మేరకు వేధించారనే ఆరోపణలున్నాయి. ఆయనకు ప్రత్యేకంగా ఎంటెక్‌లో స్పెషల్ పరీక్ష పెట్టి వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌లు ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేయించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే సంజయ్ పరీక్ష రాయనేలేదట.

ఆయన స్ధానంలో మరో వ్యక్తిని కూర్చోపెట్టి మమ అనిపించి ఫస్ట్ క్లాస్‌లో పాసైనట్లు పరీక్ష జరిగిన మరుసటి రోజే సర్టిఫికేట్ కూడా ఆఘమేగాల మీద జారీ చేసేశారు. దీనితో పాటు పలు ఏయూలో జరిగిన పలు అక్రమాలు, అన్యాయాలపై ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ, బీసీ (సి), బిసీ అల్యూమినీ అసోసియేషన్ రాష్ర్ట గవర్నర్‌కు ఫిర్యాదు చేసి ఆ తరువాత హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ విషయం బయట పడడంతో యూనివర్సిటీ అధికారులలో వణుకు పుట్టిస్తోంది.

అప్పడు డీన్‌ను పక్కన పెట్టేశారు

సంజయ్‌కు ప్రత్యేక పరీక్ష నిర్వహించిన సమయంలో యూనివర్సిటీ పరీక్షల డీన్‌గా ఆచార్య డీవీఆర్ మూర్తి వ్యవహరించారు. ఆయన నిబంధనలను గుర్తుచేయడంతో డీన్‌ను పక్కన పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ప్రశ్నా పత్రాలు తయారుచేయించి, సంజయ్‌తో స్పెషల్ పరీక్ష రాయించారు. ఈ స్పెషల్ పరీక్ష ఎవరు, ఎక్కడ నిర్వహించారో పరీక్షల డీన్‌కు తెలియదంటే, అధికార దుర్వినియోగం ఏ మేరకు జరిగిందో అర్ధమవుతుంది.

సంజయ్ అండతోనే రిజిస్ట్రార్ నియామకం

సంజయ్ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌కు స్నేహితుడు కావడంతో జేమ్స్ స్టీఫెన్ ఆంధ్ర యూనివర్సిటీలోకి అడ్డదారిలో ప్రవేశించడానికి, రిజిస్ట్రార్ అవడానికి అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కథ నడిపారనే ఆరోపణలు వున్నాయి. వీసీ ప్రసాద రెడ్డి పదవీ కాలం ముగిసిన సమయంలో 2024 ఫిబ్రవరిలో తిరిగి ఆయనే నియామకం కావడం వెనకు కూడా సంజయ్, స్టీఫెన్‌లు చక్రం తిప్పారని తెలిసింది.

విజయ సాయి రెడ్డి ఆదేశాలతో ఎంతో మందికి స్పెషల్ పరీక్ష లు, రీవాల్యుయేషన్లో పాస్ మార్కులే కాకుండా, 80 శాతం మార్కులు వచ్చాయంటే ప్రసాద రెడ్డి, స్టీఫెన్‌ల హయాంలో స్పెషల్ పరీక్ష లు, రీవాల్యూయేషన్ పేరిట పరీక్షల విభాగంలో జరిగిన అక్రమాలు చూసి సరస్వతి దేవి వంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆత్మహత్య చేసుకుందని మేధావులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘ నేతలు ఘోషిస్తున్నారు. వీటన్నింటిపైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించి వివరాలు సేకరించే పనిని ప్రారంభించింది.

Read More..

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు మరో గుడ్ న్యూస్....



Next Story