AP News:‘కట్టుకథలు చెప్పే జగన్‌కు వాస్తవాలు రుచించవు’.. ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘కట్టుకథలు చెప్పే జగన్‌కు వాస్తవాలు రుచించవు’.. ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి,నంద్యాల సిటీ: ల్యాబ్‌లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైన జగన్ తీరులో మార్పు రాలేదని, కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పంది కొవ్వు ఉండటం కట్టుకథా? కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. పాపాలను కడిగేవాడు, కోరిన కోర్కెలు తీర్చే వాడు తిరుమల తిరుపతి పై కొలువుదీరిన శ్రీనివాసుడు అని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజుకు 30 వేలు-40వేల మంది దర్శించుకుంటారని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నెలల తరబడి వేచిచూస్తారని, భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి లడ్డూ ప్రసాదం తీసుకుని, దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజ చేసి అందరికీ భక్తులు పంచుతారని అన్నారు.

హిందువులు గోమాతను దేవతగా కొలుస్తారని, దేవుడితో సమానమైన గోమాంసం నూనెను లడ్డూలో వాడటం దుర్మార్గం అని, అత్యంత పాపం అన్నారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీ చేయడం కంటే మరొక పాపం ఉండదని, ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆమె ఆరోపించారు. హిందుత్వాన్ని నమ్మని వాళ్లు, హిందువులు కాని వాళ్లు అయినటువంటి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను జగన్ చైర్మన్‌గా చేయడమే ప్రధాన పొరపాటు అని విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఓ నల్లరాయి అని, ఏడు కొండలు ఎందుకు? ఐదు కొండలు చాలు అని చెప్పి ఒక జీఓను వైసీపీ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీషు వాళ్ళు వాడే బుల్లెట్లకు గోమాంసం ఉందని తెలిసి బ్రిటీషు వారిపై విపరీతమైన తిరుగుబాటు మొదలైన ఘట్టం భారతదేశ చరిత్రలో ఉందని తెలిపారు.

నేడు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో గోమాంసం ఆనవాళ్లు, చేపనూనె ఉంది అంటే ఏం అనుకోవాలి? గత ఐదేళ్లలో హిందూ దేవాలయాలకు గౌరవం, విలువ ఇవ్వని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక వైసీపీ పాలనలో కనిపించిందని నేను చెబితే ఎవరూ పట్టించుకోలేదని, దేవాలయాలు ఇంకా ఎందుకున్నాయి? మన దేవుళ్ళు ఎందుకు ఉన్నారు? అని నాకు అనిపిస్తోందని అన్నారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారికి ఉరి తీసిన తప్పు కాదు అని, సీఎం చంద్రబాబు కఠిన శిక్ష వేస్తారని ఆశిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ క్వాలిటీ ఎలా ఉందని ల్యాబ్ టెస్టుకు పంపారు. అంటే సీఎం చంద్రబాబు చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూను కల్తీ చేసిన వైసీపీ దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని ఎంపీ శబరి అన్నారు.

Next Story

Most Viewed