పొత్తులో ఫస్ట్ సీట్ లాక్ చేసిన జనసేన..నాగబాబు పోటీ చేసేది అక్కడ నుంచే

by Seetharam |
పొత్తులో ఫస్ట్ సీట్ లాక్ చేసిన జనసేన..నాగబాబు పోటీ చేసేది అక్కడ నుంచే
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మళ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారా? గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేసి పరాజయం పాలైన నాగబాబు ఈసారి నియోజకవర్గం మార్చేస్తున్నారా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? వచ్చేఎన్నికల్లో నాగబాబు పోటీ చేయరని ప్రచారం జరిగినా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? టీడీపీ-జనసేన పొత్తుతో ఈక్వేషన్స్ మారిపోయాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొణిదెల నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయ్యాలని టీడీపీ,జనసేన నాయకులు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయం అని స్థానిక నాయకత్వం చెప్తోంది. ఇంతకీ నాగబాబును ఏ పార్లమెంట్‌కు పోటీ చేయబోతున్నారు? పోటీ చేస్తే కలిసొచ్చే అంశాలు ఏమిటి? అని తెలియాలంటే ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే.

కాకినాడ నుంచి నాగబాబు?

ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైంది.దీంతో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంపై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉన్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలకు మేనిఫెస్టో కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల పంపకాలపై చర్చలు మెుదలు కాగా తన ఎంపీ అభ్యర్థిగా మెగాబ్రదర్ కొణిదెల నాగబాబును జనసేన పార్టీ లాక్ చేసిందని తెలుస్తోంది. ఇందుకు టీడీపీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నాగబాబు అభ్యర్థిత్వంపై జనసేన, టీడీపీ మధ్య అంగీకారం కుదిరిందని చర్చ జరుగుతుంది. నాగబాబుకు కాకినాడ ఎంపీ టికెట్‌ ఇస్తారని, 2024 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమని సోషల్ మీడియాలో ఓవార్త కోడై కూస్తోంది.


కాపు ఓటు కలిసొచ్చేనా?

ఇటీవల జరిగిన ఉమ్మడి భేటీలలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దించితే బెటర్ అనే అంశంపై స్థానిక నాయకులు చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మెగా బ్రదర్ నాగబాబుని బరిలోకి దించితే బెటర్ అని అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి త్వరలోనే అధిష్టానానికి తమ ప్రతిపాదనలు పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు వెల్లడిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఓటర్ల తీర్పు సైతం విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో..ఎవరిని దూరం పెడతారో కూడా అంతుచిక్కదు. అంతేకాదు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సీపీఐ,బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే తాజాగా జనసేన పార్టీ అభ్యర్థి కొణిదెల నాగబాబును బరిలోకి దించితే బెటర్ అనే అటు టీడీపీ ఇటు జనసేనలు భావిస్తున్నాయి. ఇప్పటికే నాగబాబు పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ కూడా సహకరిస్తోందని టాక్. మరోవైపు కాపు సామాజిక వర్గం ఓటర్లు సైతం గెలుపును ప్రభావితం చేస్తారు. దీంతో ఆ ఓట్లు కూడా కలిసి వస్తే నాగబాబు గెలుపొందడం ఖాయమని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.

గతంలో కృష్ణంరాజుకు పట్టం

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పీఏసీ సభ్యుడిగా కొణిదెల నాగబాబు పార్టీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకే పరిమితమవుతారని...ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని కొందరు అంటున్నారు. ఇటీవల నాగబాబు సైతం పోటీ చేయనని ప్రకటించారు. ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ తనకే టికెట్ లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారంటూ నాగబాబు కార్యకర్తలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ-జనసేన పొత్తు దృష్ట్యా ఈక్వేషన్ మారిపోయాయి. నాగబాబును ఈ సారి బరిలోకి దించాలని నేతలు జనసేన నేతలు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మల్లిపూడి శ్రీరామ సంజీవరావు, ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, మల్లిపూడి మంగపతి పళ్ళంరాజులు గెలుపొందారు. వీరంతా ఏకంగా కేంద్రమంత్రులుగా వ్యవహరించారు. ఒకవేళ కొణిదెల నాగబాబు పోటీ చేసి గెలుపొందితే బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రిగా ఛాన్స్ కొట్టొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినీనటుడు కృష్ణంరాజును సైతం ఈ నియోజకవర్గం ప్రజలు ఆదరించారు కాబట్టి నాగబాబును ఆదరిస్తారని అంతా భావిస్తున్నారు. కృష్ణంరాజు అప్పటికప్పుడు బీజేపీలో చేరి కాకినాడ నుంచి పోటీ చేసి పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారని... కానీ నాగబాబు దశాబ్ధకాలంపాటు రాజకీయాల్లో ఉంటున్నారని అందులోనూ జనసేన యాక్టివ్‌రోల్ పోషిస్తున్న నేపథ్యంలో గెలుపు మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు. సినీనటులను ఈ నియోజకవర్గం ప్రజలు ఒకసారి ఆదరించడంతో ఈసారి కూడా ఆదరిస్తారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి కూడా నాగబాబుపై ఉంటుందని కాబట్టి ఖచ్చితంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు గెలిచే అవకాశాలు ఉన్నట్లు స్థానిక నాయకులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed